ఢిల్లీ: ఫుట్బాల్ అభిమానులకు శుభవార్త. భారత్ వేదికగా జరుగనున్న అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) సవరించింది. అండర్-17 మహిళల ప్రపంచకప్ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్నట్లు ఫిఫా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
పొలార్డ్, మలింగ మాయ.. ముంబై ఇండియన్స్ నాలుగో టైటిల్కు ఏడాది!!
వాస్తవానికి ఈ ఏడాది నవంబరు 2 నుంచి 21 వరకు భారత్లో ఈ టోర్నీ జరగాల్సింది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత నెలలో ఈ టోర్నీని ఫిఫా వాయిదా వేసింది. మంగళవారం మాత్రం కొత్త తేదీల్ని ప్రకటించింది. కోల్కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, ముంబైలలో ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతాయి. మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించింది.
'ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తూ.. ఫిఫా అనుబంధ సమాఖ్యల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాం. ఇందులో భాగంగానే టోర్నీ కొత్త తేదీలను ప్రకటిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు మెగాటోర్నీ జరుగుతుంది' అని ఫిఫా అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు.
టోర్నమెంట్ కోసం వయస్సు అర్హత ప్రమాణాలు అలాగే ఉన్నాయి. జనవరి 1, 2003 మరియు డిసెంబర్ 31, 2005 మధ్య జన్మించిన మహిళల ఫుట్బాల్ క్రీడాకారుణులు టోర్నమెంట్లో ఆడటానికి అర్హులుగా కొనసాగుతారు. అంటే.. ఇది ఇప్పుడు 'అండర్ -18' ప్రపంచకప్ అవుతుంది. ఇప్పటివరకు జపాన్, ఉత్తర కొరియా జట్లు ఆసియా నుండి అర్హత సాధించాయి. ఇక ఆతిథ్య హోదాలో భారత్ టోర్నీ ఆడనుంది. ఇంకా 13 జట్లు అర్హత సాధించాల్సి ఉంది.