న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈ ఏడాది నవంబర్లో జరగాల్సిన ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ వాయిదా పడింది. మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిఫా శనివారం వెల్లడించింది. 16 జట్లు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మ టోర్నమెంట్.. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి 21 వరకు కోల్కతా, గువహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబై వేదికలుగా జరగాల్సింది.
చిన్నప్పట్నుంచి ఆ హీరో అంటే చచ్చేంత పిచ్చి: స్మృతి మంధాన
భారత్ ఈ ఏడాదే తొలిసారిగా అండర్-17 ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొంటోంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పనామా వేదికగా జరిగే మహిళల అండర్-20 ప్రపంచకప్తో పాటు ఈ టోర్నమెంట్ను కూడా వాయిదా వేస్తున్నట్లు ఫిఫా-కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్ ప్రకటనని విడుదల చేసింది. అయితే టోర్నమెంట్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో వర్కింగ్ గ్రూప్ క్లారిటీ ఇవ్వలేదు.
వాయిదాపడిన ఫైనల్ మహిళల ఫిఫా టోర్నమెంట్లు మళ్లీ నిర్వహించేందుకు తగిన తేదీన తేదీలు ఎంపిక చేసేందుకు ఒక సబ్-వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశాం అని వర్కింగ్ గ్రూప్ ప్రకటనలో తెలిపింది. టోర్నమెంట్ల నిర్వహణపై వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని జూన్ 2020 నుంచి జరగాల్సిన అన్ని అంతర్జాతీయ మ్యాచ్లను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
'ఇటువంటి క్లిష్ట సమయంలో అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యం. జూన్ 2020 నుంచి జరగాల్సిన అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లు వాయిదా వేశాం. ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో పెట్టుకొని 2022లో జరగాల్సిన ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ల గురించి కూడా కాన్ఫెడరేషన్లతో చర్చలు జరుపుతాం' అని వర్కింగ్ గ్రూప్ స్పష్టం చేసింది.
భారత్లో శనివారం ఉదయం వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,127కి చేరుకుంది. కరొనతో 86 మంది ఇప్పటికే మృతి చెందారు. ఇప్పటికే 21 రోజులు లాక్డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం.. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో లాక్డౌన్ని మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.