మార్గావ్: నార్త్ఈస్ట్ చేతిలో రెండు గోల్స్ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్న గోవా సిటీ, ముంబైపై జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన పుణె జట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. శనివారం తన సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్లో ఎఫ్సి పుణె సిటీపై విజయంతో సాధించి ముందడుగు వేయాలని గోవా తలపోస్తున్నది. ఇక ఎఫ్సి పుణె సిటీ క్లబ్ది అదే పరిస్థితి. సొంత రాష్ట్రంలోని ముంబై సిటీ ఎఫ్సి చేతిలో ఓటమి పాలైన పుణె.. గోవాతో జరిగే మ్యాచ్లోనైనా లోటు పూడ్చుకోవాలని తలపోస్తున్నది.
నార్త్ఈస్ట్తో జరిగిన తొలి లీగ్మ్యాచ్లో ఫస్ట్గోల్ను గిఫ్ట్గా అందజేసిన ఎఫ్సి గోవా గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణి తన ఆటతీరును సవరించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. రాబిన్సింగ్, గ్రెగొరీ ఆర్నోలిన్, లుయానో సాబ్రోసా, డెంజిల్ ఫ్రాంకో వంటి ఆటగాళ్లు లేకుండా ఇంద్ర వ్యూహాలు రచించే కోచ్ జికో మార్గదర్శకత్వంలో దూకుడుగా మ్యాచ్లో పాల్గొనేందుకు ఎఫ్సి గోవా సిద్ధం అవుతున్నది
లుసియో, రాజుగైక్వాడ్ సెంట్రల్ డిఫెన్స్లో కొనసాగనుండగా, రోమియో ఫెర్నాండెజ్, మందార్రావు దేశాయి స్థిరంగా అటాకింగ్కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇద్దరు మెయిన్ అటాకర్లు రాఫెల్ కోయెల్హో, రియనాల్డో మధ్య ప్లే మేకర్ పాత్ర పోషించడం ద్వారా టీం స్కోర్ పెంపునకు జాఫ్రీ ప్రాధాన్యం ఇవ్వనున్నాడు. గత ఏడాది ఎఫ్సి గోవా తరఫున ఆడిన జొన్నాథన్ లుకాస్కు ఆ జట్టు ప్రత్యర్థి కానున్నది.

ఇక వరుసగా రెండో మ్యాచ్కు కూడా ఎఫ్సి పుణె హెడ్ కోచ్ అంటోనియో హబాస్.. మ్యాచ్కు దూరం కానున్నాడు. గత ఏడాది సెమీస్ సమయంలో జరిగిన ఘర్షణకు కారణమైన హబాస్పై అఖిల భారత్ ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్).. నాలుగు మ్యాచ్ల నిషేధం విధించింది. దీంతో ఇంతకుముందు నార్త్ఈస్ట్తో జరిగిన తొలి మ్యాచ్కు ఆయన దూరం కాగా, ఇది రెండో మ్యాచ్. పుణె సిటీ తరఫున స్కోర్ కోసం తహతహలాడుతున్న జంట జీసస్ టాటూ, గుస్తావో ఒబెర్మాన్స్ అటాకింగ్ పాత్ర పోషించనున్నారు.
సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్లో తమ జట్టు మెరుగ్గా ఆడుతుందని ఎఫ్సి గోవా జట్టు కోచ్ జికో వ్యాఖ్యానించాడు. ఖచ్చితంగా జట్టును విజయ తీరానికి తీసుకెళ్తానని, ఆటగాళ్ల దృష్టిలో విజయమే తప్ప మరో అంశం ఉండొద్దని హితవు చెప్పాడు. గోవా సిటీ జట్టు అభిమానులు తమ ఆటకు మద్దతునివ్వాలని అభ్యర్థించాడు. ఆటగాళ్లు, అబిమానుల మధ్య అనుబంధం పెరిగినా కొద్తీ తమ సామర్థ్యం మరింత పెరుగుతుందని జికో వ్యాఖ్యానించాడు. ఒక మ్యాచ్లో ఓటమి పాలైనంత మాత్రాన తన వ్యూహంలో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొన్నాడు.
నార్త్ఈస్ట్ జట్టు పూర్తిగా పైచేయి సాధించడంతోపాటు ఆ జట్టు విజయంలో పలు అంశాలు ఇమిడి ఉన్నాయని పేర్కొన్నాడు. తమ గోల్ కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమణిపై బోలెడంత విశ్వాసముందని, ఆయన ఆధ్వర్యంలో మంచి ఫలితాలు సాధించామని అన్నాడు. చాంపియన్స్ లీగ్లోనూ, ప్రపంచ కప్లోనూ ఇటువంటి ఘటనలు జరుగుతాయని, లక్ష్మీకాంత్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంచేశాడు. ఒక గోల్ కీపర్ సరిగ్గా ఉంటే జట్టులోని ఇతర సభ్యులు మెరుగ్డా ఆడతారన్నాడు. సొబ్రోసా, గ్రేగోరీ, దేబబ్రత రాయ్ గాయాల కారణంగా మ్యాచ్కు దూరంగా ఉంటున్నారని తెలిపాడు.
హబాస్ గైర్హాజరీలో మ్యాచ్కు నేతృత్వం వహిస్తున్న పుణె సిటీ అసిస్టెంట్ కోచ్ మిగైల్ ఎట్టి పరిస్థితుల్లోనూ గోవాపై విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు. సొంత గడ్డపై, ఇతర వేదికలపై జరుగుతున్న మ్యాచ్ల్లో ఎటువంటి తేడా ఉండదని, ఆటతీరే కీలకమని తద్వారా మాత్రమే పాయింట్లు లభిస్తాయని విశ్వసిస్తున్నాడు. ప్రీ సీజన్ నుంచి టీం నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చామని, లీగ్ ప్రారంభంలో ఒక మ్యాచ్ను కోల్పోయినా జట్టుకు మెరుగులు దిద్దడానికే మొగ్గు చూపుతున్నామన్నాడు.
ఇదిలా ఉంటే జట్టు కెప్టెన్గా ఉన్న మహ్మద్ సిస్సోకో శనివారం మ్యాచ్కు నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఈ విషయమై మైగెల్ స్పందిస్తూ సిస్సోకో ఫిట్గా ఉన్నాడనే భావిస్తున్నా, కానీ ఆయన ఆడతాడా? లేదా? అన్న విషయం తాను చెప్పలేనని, అయితే కొత్తగా ఫ్రాంచైసీ యాజమాన్యంతో సంతకాలు చేసిన సిస్సోకో, డ్రామానే ట్రారో ఫిట్గా ఉన్నారని, వారు ఆటడం తప్పనిసరని పేర్కొన్నాడు.
పుణె సిటీ మిడ్ ఫీల్డర్ లెన్నీ రోడ్రిగ్స్.. గోవా కుర్రాడు కావడంతో సొంత రాష్ట్ర జట్టుపై ఆడాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నాడు. ఇదంతా అబద్దమని రోడ్రిగ్స్ వ్యాఖ్యానించాడు. క్రీడాకారుడు ఒత్తిళ్లను అధిగమించే సామర్థ్యం పెంపొందించుకోవాలి. గత రెండు సీజన్లలోనూ తాను గోవా జట్టుకు వ్యతిరేకంగానే ఆడానని గుర్తుచేశాడు. గోవా జట్టు చాలా పటిష్ఠమైందని, మ్యాచ్ ఆడటం చాలా కష్టమని పేర్కొన్నాడు.