పుణె: ఎఫ్ సి గోవా జట్టుపై జరిగే మ్యాచ్లో వ్యక్తిగత రికార్డులను మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు ఎఫ్ సి పుణె సిటీ హెడ్ కోచ్ అంటోనియో హబాస్. గురువారం రాత్రి ఏడు గంటలకు గోవా జట్టుతో పుణె తలపడనున్నది. గోవా మేనేజర్ జికో సైతం పాయింట్ల పట్టికలో దిగువ నుంచి పైకి దూసుకెళ్లే మార్గాలను అన్వేషిస్తున్నాడు.
ఐఎస్ఎల్ టోర్నమెంట్లోనే తొలిసారి ఇటు పుణె కోచ్ అంటోనియో హబాస్, అటు గోవా మేనేజర్ జికో ఇబ్బందికర పరిస్థితులనెదుర్కొంటున్నారు. కానీ పుణె మేనేజర్ హబాస్ మాత్రం తాము దిగువ శ్రేణి ర్యాంకు నుంచి తప్పనిసరిగా బయటపడతామని దీమా వ్యక్తంచేశాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐఎస్ఎల్ 3 ఎడిషన్లో ఇప్పటివరకు ఇరు జట్లు ఏడు మ్యాచ్ల్లో పాల్గొన్నాయి. జికోను హబాస్ నాలుగు సందర్భాల్లో నిలబెట్టేశాడు. బ్రెజిలియన్ కోచ్గా జికో.. పుణెపై జరిగిన ఒక్క మ్యాచ్లో కూడా గెలుపొందలేదు. జికో ఆధ్వర్యంలోని గోవా జట్టు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నది.
ఏడు మ్యాచ్ల్లో కేవలం నాలుగు పాయింట్లతో ఇప్పటికీ దిగువనే తచ్చాడుతున్నది. ఇక పుణె సిటీ సైతం ఆరు మ్యాచ్ ల్లో ఆరు పాయింట్లతో గోవా కంటే ఒక మెట్టుపై నుంచి ముందుకు కదిలేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సొంతగడ్డపై దురద్రుష్టం వారిని వెంటాడుతున్నది.
12 పాయింట్లు సంపాదించుకునే అవకాశాలు ఉన్నా ఆ జట్లు తమ సొంత గడ్డపై ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయలేదు. అద్రుష్టవశాత్తు పుణె జట్టు తన సొంతగడ్డపై ఒక్కసారి కూడా గోవా చేతిలో ఓటమి పాలవ్వలేదు. ఒక మ్యాచ్ను డ్రా గా ముగించిన పుణె మరో మ్యాచ్లో విజయం సాధించింది.

గురువారం జరిగే మ్యాచ్లో మరోసారి విజయం సాధించి ఇప్పుడు కూడా అదే రికార్డును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. ఐఎస్ఎల్ 3 ఎడిషన్లో పుణె నాలుగు మ్యాచ్లను విజయం లేకుండానే ముగించింది. ఆరు మ్యాచ్ల్లోనూ కేవలం ఆరు పాయింట్లతో దిగువ శ్రేణిలో తచ్చాడుతుండటం ఐఎస్ఎల్ టోర్నీ రికార్డులోనే హబాస్ సేనకు దారుణమైన రికార్డుగా మిలిగిపోనున్నది.
కానీ హబాస్లో మాత్రం ప్రశాంతత చెక్కు చెదరలేదు. ఈ సందర్భంగా హబాస్ మీడియాతో మాట్లాడుతూ 'గత సీజన్లో చెన్నై పలు గేమ్స్లో శుభారంభాన్ని అందుకోలేక చతికిల పడిన సంగతి నాకు గుర్తుంది. కానీ మా జట్టు సారధి అక్టోబర్ మొదటివారంలో చేరాడు. 90 శాతం టీం కూడా కొత్తదే. కానీ మేం కష్టపడుతున్నాం' అని తెలిపాడు.
తొలి ఎడిషన్లో ఎఫ్ సి గోవా కేవలం ఐదు పాయింట్లతోనే టోర్నీ చివరి వరకు సాగింది. కానీ సెమీ ఫైనల్స్కు అర్హత సాధించడంతోపాటు అప్పటి కోచ్ హబాస్ సారధ్యంలో శిక్షణ పొందిన అట్లెటికో డీ కోల్ కతా చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్లో ఇప్పటికీ గోవా కోచ్ జికో పాజిటివ్ ద్రుక్పథంతోనే వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈ దఫా తమ టాస్క్ కొంచెం విభిన్నంగా ఉన్నదని వ్యాఖ్యానించాడు. 'మా పరిస్థితి సంక్లిష్టంగా, విభిన్నంగా ఉంది. ఇకముందు జరిగే ఏడు మ్యాచ్ లలో మేం కనీసం ఐదు మ్యాచ్ లలో విజయం సాధించాలి. కానీ మేం చివరి క్షణం వరకూ పోరాడతాం. మాకు ఆశలు ఉన్నాయి' అని జికో తెలిపాడు.
మ్యాచ్ లో విజయావకాశాలను కల్పించుకొనే శక్తి సామర్థ్యాలు లేక గోవా కుర్రాళ్లు సతమతమవుతున్నారు. గతేడాది ఫైనల్స్ కు చేరుకున్న గోవా ప్లేయర్స్ అట్లెటికో డీ కోల్ కతా, ఢిల్లీ డైనమోస్ జట్లతో చేసిన 67 షాట్లు చివరకు ప్రత్యర్థి జట్ల గోల్ కీపర్ల సామర్థ్యాన్ని ప్రశ్నించేవే. 50 శాతానికి పైగా వారి షాట్లు టార్గెట్ చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఏడాది షాట్లను గోల్స్ గా మార్చే అవకాశం ఈ దఫా దారుణ స్థాయిలో 5.97 శాతానికి పడిపోయింది. అయినా జికో వచ్చే ఏడు మ్యాచ్ లలో ఐదింట గెలుపొందుతామని విశ్వాసంతో ఉన్నాడు. తన స్ట్రియికర్లు చెలరేగిపోవడం మొదలు కాలేదని అభిప్రాయ పడుతున్నాడు.
బకాయిలు చెల్లించకుంటే ఐఎస్ఎల్ మ్యాచ్లకు నో
పనాజీ: పాటోర్డాలో తదుపరి జరిగే ఐఎస్ఎల్ మ్యాచ్ ను జరుగనివ్వబోమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గోవా (ఎస్ఎజి).. ఎఫ్ సి గోవా జట్టు యాజమాన్యాన్ని హెచ్చరించింది. ప్రస్తుత ఎడిషన్లో తమ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లకు రూ.1.67 కోట్ల బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 11న జరిగే మ్యాచ్ కు అనుమతించబోమని సాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విఎం ప్రభూదేశాయ్ చెప్పారు.
వారు బకాయిలు చెల్లించకపోవడంతో స్టేడియంలో వసతులు చేపట్టేందుకు ఇబ్బందులు తలెత్తుతన్నాయన్నారు. తమ బకాయిలు చెల్లించకుంటే తదుపరి మ్యాఛ్ ను అనుమతించబోమని ఇప్పటికే ఐఎస్ఎల్ నిర్వాహకులకూ కూడా సమాచారం ఇచ్చామన్నారు. ఇదిలా ఉంటే సౌత్ గోవా పోలీసులు తమ భద్రతా ఏర్పాట్లకు రూ.3.80 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.