ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ను గెలిపించడానికి ఒంటరి పోరాటం చేసిన యోధుడు కిలియన్ ఎంబాపే. ఆట ఆరంభం నుంచే అర్జెంటీనా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ గురించి జరిగిన ప్రచారంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య పోరు అని కాకుండా.. మెస్సీ వర్సెస్ ఎంబాపే అని ఎక్కువ ప్రచారం జరిగింది. కానీ ఎంబాపే దగ్గరకు కూడా బంతి రాలేదు. మరో పది నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా అర్జెంటీనా 2-0 ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. 89వేల కెపాసిటీ ఉన్న లుసైల్ స్టేడియంలో అర్జెంటీనా జెండాలు రెపరెపలాడుతున్నాయి. అప్పటికే ఓటమిని అంగీకరించిన ఫ్రాన్స్ అభిమానులు నిరాశగా చూస్తుండిపోయారు.
అలాంటి సమయంలో ఆ జట్టుకు పెనాల్టీ దక్కింది. దాన్ని గోల్గా మలిచిన ఎంబాపే.. మరు నిమిషంలోనే మరో మెరుపు గోల్ చేశాడు. అంతే స్టేడియం అంత దద్దరిల్లిపోయింది. అప్పటి వరకు నిరాశగా ఉన్న అభిమానుల్లో కొత్త జోష్ నిండింది. మ్యాచ్ ఎక్స్ట్రా టైంలోకి వెళ్లింది. అప్పుడు కూడా అర్జెంటీనా తరఫున మెస్సీ మరో గోల్ చేసి ఆ జట్టుకు ఆధిక్యం అందించాడు. ఇక ఫ్రాన్స్ పని అయిపోయిందనుకునే సమయంలో మరోసారి ఎంబాపే తన మూడో గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. ఇలా వరల్డ్ కప్ ఫైనల్లో హ్యాట్రిక్ గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో 1966లో ఇంగ్లండ్ ప్లేయర్ జాఫ్ హస్ట్ మాత్రమే ఫైనల్లో ఇలా హ్యాట్రిక్ సాధించాడు.
కానీ పెనాల్టీ షూటవుట్లో మాత్రం ఫ్రాన్స్ రాణించలేదు. అప్పుడు కూడా ఎంబాపే తొలి గోల్ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు గోల్స్ చేయలేకపోయారు. దీంతో చివరకు 4-2 తేడాతో ఫ్రాన్స్ ఓటమిపాలైంది. ఇది చూసిన అభిమానులు.. ఎంబాపే ఓడిపోకుండా ఉండాల్సిందని అంటున్నారు. ఒక లెజెండ్ తయారవడం చూస్తున్నామని కొనియాడుతున్నారు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన ఎంబాపే మొత్తం 8 గోల్స్ చేశాడు. దీంతో అతనికి 'గోల్డెన్ బూట్' అవార్డు కూడా దక్కింది. ఎంబాపే ఆటతీరు చూసిన వాళ్లు మాత్రం అతనే ట్రోఫీ ముద్దాడాల్సింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.