అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇప్పుడు కుటుంబం కన్నా ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీలే ముఖ్యంగా మారాయి. ఆయన భార్య సాక్షి రావత్ సింగ్ శుక్రవారం సాయంత్రం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ పోటీలకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న ధోనీ ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. ఈ సమయంలో ప్రపంచ కప్ ముఖ్యమని, సాక్షిని చూడడడం కన్నా అది ముఖ్యమని ఆయన భావిస్తున్నాడు.
గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాక్షి ఆడపిల్లకు శుక్రవారం సాయంత్రం జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. ధోనీ మాత్రం తన జట్టు సభ్యులతో ఆస్ట్రేలియాలో గడుపుతున్నాడు. అడిలైడ్లో ధోనీ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సమయంలో మీరు మీ భార్యతో ఉండాలని అనుకుంటున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగితే లేదని చెప్పాడు.

నిజానికి లేదు. నాకు కూతురు పుట్టింది. తల్లీకూతుళ్లు ఇరువురూ బాగున్నారు అని అన్నాడు. ఇప్పుడు తాను జాతీయ విధుల్లో ఉన్నానని, అందువల్ల ప్రతిదీ తన కోసం ఎదురు చూస్తుందని అన్నాడు. ప్రపంచ కప్ అత్యంత ముఖ్యమైందని ధోనీ అన్నాడు.
భారత్ తన తొలి మ్యాచులో పాకిస్తాన్ను ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో ఎదుర్కుంటోంది. ప్రపంచ కప్ మార్చి 29వ తేదీన ముగుస్తుంది. అప్పటి వరకు ధోనీ తన కూతురిని చూసే అవకాశం లేదని అంటున్నారు సాక్షితో ధోనీ వివాహం 2010 జులై 4వ తేదీన జరిగింది.