ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న ఇంగ్లండ్.. అభిమానుల అంచనాలను అందుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే నాకౌట్స్ మ్యాచ్లో సెనెగల్ను 3-0 తేడాతో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఇంగ్లండ్ ముందు సెనెగల్ జట్టు ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.
గ్రూప్ దశలో ఇరాన్, వేల్స్ను ఓడించిన ఇంగ్లండ్.. యూఎస్ఏతో మ్యాచ్ను డ్రా చేసుకుంది. దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్ బీ టాపర్గా నాకౌట్స్ చేరింది. అదే సమయంలో సెనెగల్ జట్టు గ్రూప్ ఏ రన్నరప్లుగా నాకౌట్స్ చేరింది. ఈ టీం నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. అయితే ఈక్వెడార్, ఖతర్లను ఓడించి ఆరు పాయింట్లతో నాకౌట్స్ చేరింది. ఈ జట్టులో స్టార్ ప్లేయర్ సదియో మానే లేకపోయినా ఆ జట్టు మాత్రం మంచి ప్రదర్శన చేస్తూ వచ్చింది.
నాకౌట్స్లో భాగంగా ఇంగ్లండ్, సెనెగల్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ జట్టు ఆధిపత్యం కనబరిచింది. బంతిని ఎక్కువ సేపు తమ వద్దనే ఉంచుకున్న ఇంగ్లండ్.. నాలుగు సార్లు గోల్ చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయితే 38వ నిమిషంలో జూడ్ బెల్లింగ్హామ్ ఇచ్చిన చక్కని పాస్ను అందుకున్న జోర్డాన్ హెండర్సన్ తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే హ్యారీ కేన్ మరో గోల్ చేయడంతో హాఫ్ టైం ముగిసే సరికి ఇంగ్లండ్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.
సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కూడా ఇంగ్లండ్ జట్టు అదే జోరు కొనసాగించింది. పన్నెండు నిమిషాల్లోనే ఫోడెన్ అందించిన పాస్ను బుకాయా సాకి గోల్గా మలిచాడు. దీంతో ఇంగ్లండ్ ఆధిక్యం 3-0కు చేరింది. ఆ తర్వాత సెనెగల్ జట్టు ఎంత కష్టపడినా కనీసం ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. దీంతో ఆ జట్టును 3-0తో ఓడించిన ఇంగ్లండ్ దర్జాగా క్వార్టర్ ఫైనల్స్ చేరింది.