కైరో: ఈజిప్టులోని కైరో ఎయిర్ డిఫెన్స్ ఫుట్బాల్ స్టేడియంలో వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణ తీవ్ర రూపం దాల్చి దాదాపు 22 మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. అభిమానులు, భద్రతా దళాల సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. లీగ్ క్లబ్ జమేలక్, ఈఎన్పిపిఐ మధ్య మ్యాచ్ సందర్బంగా అభిమానులు టికెట్లు లేకుండా స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
దాంతో అకస్మాత్తుగా తీవ్ర ఘర్షణ చెలరేగి, ఉద్రిక్తతకు దారి తీసింది. మూకను అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణ కారణంగా ఈజిప్టు అధికార యంత్రాంగం ఫుట్ బాల్ లీగ్ మ్యాచులను రద్దు చేసింది.

పోలీసులు తొలుత జమాలెక్ మద్దతుదారుల వైపు టియర్ గ్యాస్ వదిలారు. ఒకే గేట్ తెరిచి ఉంచడాన్ని అభిమానులు తప్పు పట్టారు. జమేలాక్ మద్దతుదారుల గ్రూప్ వైట్ నైట్స్ నాయకులపై అరెస్టు వారెంట్ జారీ అయింది. గతంలో ఓసారి కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పోర్టులో తలెత్తిన ఘర్షణలో 2012లో 74 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు.
ఆదివారం జరిగిన ఘర్షణలో పలువురు గాయపడినప్పటికీ ఆ మ్యాచ్ కొనసాగింది. స్టేడియం వద్ద మృతుల బూట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వైర్లు వేసిన ఒక్క గేటు మాత్రమే తెరవడంతో సంఘటన చోటు చేసుకుందని జమేలాక్ అభిమానులు విమర్శిస్తున్నారు.