
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ జరిగే లుసైల్ స్టేడియంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ మెరవనుంది. ఇక్కడ ఫైనల్ మ్యాచ్కు ముందు ట్రోఫీ ఆవిష్కరించే కార్యక్రమంలో ఆమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ముంబై నుంచి ఆమె దోహా బయలుదేరింది. ఈ సందర్భంగా ముంబై ఎయిర్పోర్టులో ఆమె నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆదివారం నాడు జరిగే ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్.. అర్జెంటీనాతో తలపడనుంది.
అయితే ఈ మ్యాచ్కు ముందు ఫ్రాన్స్ శిబిరంలో ఒక మిస్టరీ వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ జట్టులో సుమారు ఐదుగురు ఆటగాళ్లు ఈ వైరస్ బారిన పడి అనారోగ్యం పాలయ్యారు. జలుబు, జ్వరం, కడుపునొప్పి తదితర లక్షణాలతో వాళ్లు బాధపడుతున్నట్లు సమాచారం. మొరాకోతో జరిగిన సెమీఫైనల్స్ ముందే ఫ్రాన్స్ ఆటగాళ్లు ఆడ్రియన్ రాబియట్, డేయట్ ఉపామెకానో ఇద్దరూ అనారోగ్యంతో జట్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత సెంట్రల్ డిఫెండర్లు రఫేల్ వరానే, ఇబ్రహీం కొనాటే కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.చివరగా వింగర్ కింగ్స్లే కోమన్ కూడా అనారోగ్యం పాలైనట్లు ఫ్రాన్స్ జట్టు వెల్లడించింది.

దీంతో ఫ్రాన్స్ చేయగలిగే సబ్స్టిట్యూట్స్ తగ్గిపోయారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న ఆటగాళ్ల ఫిట్నెస్పై ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెస్చాంప్స్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. అనారోగ్యంపాలైన ఆటగాళ్ల పరిస్థితిపై కొత్త అప్డేట్ ఏమీ లేదన్న అతను.. ఇది అనూహ్య పరిణామమని, ఎవరూ ఊహించలేదని అన్నాడు. అయితే దీన్ని తాము సాధ్యమైనంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నామని వివరించాడు. జట్టు కెప్టెన్ హ్యూగో లోరిస్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఇలాంటి పరిస్థితులను తాము ప్రిపేర్ అవ్వలేదని, అయితే చాలా జాగ్రత్తగా పరిస్థితిని హ్యాండిల్ చేస్తున్నామని తెలియజేశాడు.