
హైదరాబాద్: భారత ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఖతార్తో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టుపై కెప్టెన్ సునీల్ ఛెత్రి ప్రశంసల వర్షం కురిపించాడు. మంగళవారం ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ కంటే మెరుగ్గా ఉన్న ఖతార్తో జరిగిన మ్యాచ్ను 0-0తో డ్రాగా ముగించింది.
ఈ డ్రాతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. మ్యాచ్ అనంతరం సునీల్ ఛెత్రి తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. "డియర్ ఇండియా, ఇదీ నా జట్టు అంటే.. వాళ్లు నా జట్టు సభ్యులు. నేను ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. పాయింట్ల పరంగా మంచి ఫలితం కాకపోయినా.. పోరాడిన విధానం అభినందనీయం. కోచింగ్ స్టాఫ్ తదితరులకు ఈ క్రెడిట్ దక్కుతుంది" అని ట్వీట్ చేశాడు.
ఖతార్ వేదికగా 2022లో జరిగే ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం ఖతార్ వేదికగా క్వాలిఫయర్ మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్లో భారత ఫుట్బాల్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఒమన్తో సెప్టెంబర్ 5న జరిగిన తొలి మ్యాచ్లో 1-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైనా భారత జట్టు ఖతార్తో జరిగిన మ్యాచ్లో మాత్రం చెలరేగారు.
జస్సిమ్ బిన్ హమద్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అంచనాలను తలక్రిందులు చేసి ఖతార్ను ఒక్క గోల్ కూడా కొట్టనీయలేదు. అనారోగ్యం కారణంగా స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునిల్ ఛెత్రీ దూరమైన ఈ మ్యాచ్లో.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ కీలక పాత్ర పోషించాడు.
బ్రెజిల్, అజ్రెంటినా, కొలంబియా తర్వాత ఖతార్ని గోల్ చేయకుండా చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో ఆ తర్వాత ఆడాల్సిన మూడు మ్యాచుల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.