కోచి: తొలి మ్యాచ్లో స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో జోరు మీదున్న ఢిల్లీ డైనమోస్ కుర్రాళ్లు అదే పంథాను కొనసాగించగలమని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్పై 3 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించిన ఢిల్లీ డైనమోస్.. తాజాగా కేరళ బ్లాక్ బస్టర్స్పై ఆదివారం సాయంత్రం జరిగే మ్యాచ్లో విజయంపై కన్నేశారు.
ఇదే దూకుడు ఇక ముందు కొనసాగాలని ఢిల్లీ జట్టు కోచ్ జంబ్రొట్టా ఆశిస్తున్నాడు. 'రేపు అది మాకు ముఖ్యమైన మ్యాచ్. చెన్నైయిన్ ఎఫ్సిపై మేం గెలిచాం. కానీ ఆలోచనల్లో మార్పు రాలేదు. మేం తదుపరి మ్యాచ్లోనూ ఇదే మెరుగైన ఆటతీరు ప్రదర్శించాలని భావిస్తున్నాం' అని జంబ్రొట్టా వ్యాఖ్యానించాడు.
కేరళ బ్లాక్బస్టర్స్తో జరిగే మ్యాచ్లో ఢిల్లీ డైనమోస్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నా కోచ్ జంబ్రొట్టా వ్యూహం మరోలా ఉంది. 'కేరళ బ్లాక్ బస్టర్స్ తన రెండు మ్యాచ్ల్లోనూ ప్రత్యర్థుల చేతిలో పరాజయాన్ని చవిచూసింది. కానీ వారు సొంత గడ్డపై ఆడుతున్నారు. విజయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 60 వేల మంది ఫ్యాన్స్ అందుబాటులో ఉండటం వారికి కలిసొచ్చే అంశం' అని జంబ్రొట్టా పేర్కొన్నాడు.
రెండు వరుస ఓటములు ఎదురైనా కేరళ బ్లాక్ బస్టర్స్ కోచ్ స్టీవ్ కొప్పెల్ మాత్రం తమ జట్టులోని అన్ని విభాగాల్లో భారీగా పురోగతి సాధించామన్నారు. బ్రేక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. తొలుత ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్లో నార్త్ఈస్ట్పై, తర్వాత కోచిలోనే అట్లెటిక్ డీ కోల్కతాచేతిలో ఓటమి పాలయ్యారు కేరళ బ్లాక్ బస్టర్స్.
'అన్ని ఏరియాల్లో జట్టు పుంజుకున్నదనే భావిస్తున్నా. గత మ్యాచ్లో పూర్తిగా అటాకింగ్ ధోరణితో ఆడటం వల్ల ప్రత్యర్థి జట్టు డిఫెన్సివ్ గోల్ చేయగలిగిందని, మిడ్ఫీల్డ్లో అప్పుడప్పుడు అటాచ్మెంట్ లేకపోవడం, స్ట్రైకర్లు తమ స్కోరింగ్ సామర్థ్యాన్ని మెరుగు పరుచుకోకపోవడం వంటి పొరపాట్లు జరిగాయి. మేం దాన్ని చేయగలమని భావించాం. మేం గ్రౌండ్లో పూర్తిస్థాయిలో శిక్షణ పొందాం' అని అన్నాడు.
తాజాగా జట్టులో కోపెల్ ఆరు మార్పులు చేసి, భవిష్యత్లో మరికొన్ని మార్పులు తప్పవని హెచ్చరించాడు. గణనీయ మార్పులు చేయాలని తాను భావించలేదని, కానీ మార్పులు చేయక తప్పలేదన్నాడు. టోర్నమెంట్ అన్న తర్వాత డిమాండ్తో కూడుకున్నదని, జట్టు, వ్యక్తిగతంగా ఆటగాళ్ల ప్రతిభ, ఫిట్నెస్ ఆధారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కనుక మ్యాచ్లు కొన్ని మార్పులు ఉంటాయి. మేం ఈ మ్యాచ్లో విజయంతో ముందడుగు వేయాలని యోచిస్తున్నాం' అని తెలిపాడు. ఫుట్బాల్లో సక్సెస్కోసం భారతీయులంతా ఆర్తిగా ఎదురుచూస్తున్నారని కొప్పెల్ అన్నాడు.
ఇదిలా ఉంటే కేరళ బ్లాక్బస్టర్స్కు వ్యతిరేకంగా వారి సొంత గడ్డ కోచిపై ఆడటం ఇదే తొలిసారని ఢిల్లీ డైనమోస్ అటాకర్ కీన్ లూయీస్ వ్యాఖ్యానించాడు. భారీగా తరలి వచ్చే కేరళ అభిమానుల మధ్య మ్యాచ్ ఆడటం ఒక సవాలేనన్నాడు. తాము వారంలో మూడు, నాలుగు రోజులు ప్రయాణానికే సరిపోతున్నదని, మ్యాచ్ ఆడిన తర్వాత సేద తీరే అవకాశం ఉండటం లేదన్నాడు.