
స్పెయిన్: మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19) భయంతో ప్రపంచం వణికిపోతున్న తరుణంలో 'సాకర్ కింగ్', పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియా ద్వారా అందరికీ ఓ విన్నపం చేశాడు. కరోనా బారి నుంచి ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇన్స్టాగ్రామ్లో రొనాల్డో భావోద్వేగపూరిత పోస్ట్ చేశాడు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం నడుచుకోవాలని చెప్పాడు.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అనేక క్రీడా పోటీలు రద్దవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుట్బాల్ టోర్నీలు సైతం రద్దయ్యాయి. జర్మనీ, ఇటలీ ఫుట్బాల్ జట్ల మధ్య ఈ నెల 31న జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దయింది. అలాగే రోనాల్డో సహచర ఆటగాడు డేనియల్ రుగానికి కరోనా వైరస్ సోకింది. దీంతో రొనాల్డో సహా ఆ జట్టు ఆటగాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
ప్రపంచమంతా కఠిన పరిస్థితుల్లో ఉంది. మనమంతా తగిన జాగ్రత్తలు పాటించి, అప్రమత్తంగా ఉండాలని క్రిస్టియానో రొనాల్డో ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. 'ఈరోజు నేను ఫుట్బాల్ ప్లేయర్గా మాట్లాడట్లేదు. ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న తాజా పరిణామాలకు సంబంధించిన మానవతా వాదిగా మాట్లాడుతున్నా. ప్రస్తుత పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్థానిక ప్రభుత్వాలు సూచించిన విషయాలను మనమంతా కచ్చితంగా పాటించాల్సిన అవసరముంది' అని పేర్కొన్నాడు.
'ఇతరుల ప్రాణాలు కాపాడటమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కావాలి. ఈ మహమ్మారి కారణంగా ఆప్తులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. నా సహచరుడు డేనియల్ రుగానిలా కరోనా వైరస్ బారిన పడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని క్రిస్టియానో రొనాల్డో ఇన్స్టాలో భారమైన హృదయంతో రాసుకొచ్చాడు.