
హైదరాబాద్: సాకర్కు వీడ్కోలు పలికే నాటికి ఏడు బాలెన్ డీ ఓర్ (అత్యుత్తమ క్రీడాకారుడు) అవార్డులను గెలుచుకోవాలని ఉందని పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో స్పష్టం చేశాడు. ఓ స్పోర్ట్స్ మేగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి లక్ష్యాలను వెల్లడించాడు.
ఏడుగురు పిల్లలను కనడంతో పాటు, ఏడు బాలోన్ డీ ఓర్ అవార్డులు సంపాదించడమే ప్రస్తుతం తన ముందు ఉన్న లక్ష్యమని రొనాల్డో తెలిపాడు. ఇటీవలే క్రిస్టియానో రొనాల్డో, అతని గర్ల్ఫ్రెండ్ జార్జీనా రోడ్రిగేజ్ దంపతులు నాలుగో బిడ్డ జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ 'నా ఇంట్లో ఏడుగురు పిల్లలు ఉండాలి. అలాగే ఏడు బాలెన్ డీ ఓర్ అవార్డులూ ఉండాలి. అందుకే ఇప్పటికిప్పుడు దేనిని ఆపదలచుకోలేదు. ఆడినంత కాలం అవార్డులు గెలుస్తూనే ఉండాలి. గెలుస్తూనే ఉంటా' అని రొనాల్డో పేర్కొన్నాడు.
వచ్చే నెల రానున్న ఐదో బాలోన్ డియోర్ అవార్డు కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. 'వచ్చే ఏడాది ఐదో అవార్డును సొంతం చేసుకోవాలన్నది నా కల. ఆ తర్వాతి ఏడాది మరోటి. ఇలా ఏడు వరకు వెళ్లాల్సిందే' అని రొనాల్డో తన తదుపరి లక్ష్యాలను వెల్లడించాడు.
తన 15 ఏళ్ల కెరీర్లో రొనాల్డో నాలుగుసార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. 32 ఏళ్ల రొనాల్డోకు క్రిస్టియానో జూనియర్తో పాటు ఇవా, మాటియో అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఇటీవల జన్మించిన పాపకు అలాన మార్టినా అని పేరు పెట్టాడు.
'అలాన మార్టినా మా కుటుంబంలోకి వచ్చేసింది. జియో, అలాన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం' అని తన ఏడేళ్ల క్రిస్టియానో జూనియర్, జార్జీనతో ఆసుపత్రిలో కలిసి ఉన్న ఫొటోను రొనాల్డో తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.