హైదరాబాద్: 2015-16 సంవత్సరానికి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పోర్చుగల్ పుట్బాల్ క్రీడాకారుడు, రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డుని రోనాల్డో అందుకోవడం ఇది నాలుగోసారి.
ఇక ఈ అవార్డు రేసులో ఉన్న లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) రెండోస్థానాన్ని దక్కించుకోగా ఆంటోనీ గ్రీజ్మాన్ (ఫ్రాన్స్) మూడోస్థానంలో నిలిచారు. ఇక ఇటలీకి చెందిన మాంచెస్టర్ సిటీ క్లబ్ కోచ్ క్లాడియో రనీరి ఉత్తమ కోచ్ అవార్డును దక్కించుకున్నాడు.
గత ఏడాది చాంపియన్స్ లీగ్, తొలిసారి పోర్చుగల్ జట్టుకు సారథిగా యూరో 2016 కప్ టైటిళ్లతోపాటు క్లబ్ ఫిఫా వరల్డ్ కప్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఇక 2016లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఆటగాళ్లను ఎంపిక చేసి ఫిఫా రొనాల్డోకు ఈ అవార్డును ఇచ్చింది.

స్విట్జర్లాండ్లోని జూరిచ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సోమవారం రాత్రి నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినోనుంచి ఈ అవార్డును అందుకున్న తర్వాత రోనాల్డో మాట్లాడుతూ 2016 సంవత్సరం తనకు అద్భుతమైన సంవత్సరం అని అభివర్ణించాడు.
పుట్బాల్ ఆటలో తన చిరకాల ప్రత్యర్థి అయిన మెస్సీ కూడా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రోనాల్డో 2008, 2013, 2014లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు.
ఇటీవల కొలంబియా కొండల్లో కూలిపోయిన విమాన ప్రమాదంలో మృతి చెందిన బ్రెజిల్ ఫుట్బాల్ క్లబ్ చాపెగోనేస్ క్రీడాకారుల ప్రత్యర్థి అయిన అట్లెటికో నాసియోనల్ జట్టు ఫిఫా ఫెయిర్ప్లే అవార్డును అందుకుంది.