
హైదరాబాద్: జైలు శిక్ష నుంచి ఫుట్బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తప్పించుకున్నాడు. స్పెయిన్ దేశంలో పన్ను ఎగవేత కేసులో మ్యాడ్రిడ్ కోర్టు అతడికి రూ. 152 కోట్ల భారీ జరిమానాతో సరిపెట్టింది. ఈ భారీ జరిమానా చెల్లించేందుకు రొనాల్డో అంగీకరించాడు.
దీనికి అంగీకరించిన కోర్టు జైలు శిక్ష నుంచి రొనాల్డోను జైలు శిక్ష నుంచి విముక్తుడిని చేసింది. దీని ప్రకారం రొనాల్డో కోటీ 88 లక్షల యూరోలు (సుమారు రూ. 152 కోట్లు) ప్రభుత్వానికి జరిమానాగా చెల్లించనున్నాడు.
అసలేం జరిగింది?
స్పెయిన్ క్లబ్ రియల్ మాడ్రిడ్ తరఫున 2009 నుంచి 2018 వరకు రొనాల్డో ఆడాడు. అయితే 2011-14 మధ్యలో తనకు వచ్చిన ఆదాయాన్ని అతను బాగా తగ్గించి చూపుతూ పన్ను ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు. పైగా నిబంధనల ప్రకారం తక్కువగా పన్ను చెల్లించాల్సి వచ్చే రియల్ ఎస్టేట్లో తాను ఈ డబ్బులు సంపాదించానంటూ తప్పుడు నివేదికను సమర్పించాడు.
ఈ తప్పిదానికి రొనాల్డోపై రూ. 118 కోట్ల మేర పన్ను ఎగవేతలకు పాల్పడ్డాడనే కేసు నమోదైంది. ఈ కేసులో రొనాల్డోకు సుమారు 23 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉండేది. అయితే, కొన్ని రోజుల క్రితం జరిమానా చెల్లించేందుకు సిద్ధమంటూ రొనాల్డో రాజీ ప్రతిపాదన చేశాడు. దీంతో మంగళవారం కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.