న్యూఢిల్లీ: భారత ఫుట్ బాల్ జాతీయ జట్టు కోచ్ గా స్టీఫెన్ కాంస్టాటైన్ సేవలు మరో ఏడాది పాటు అందుబాటులో ఉంటాయి. 2019 ఆసియా కప్ ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
దీని ప్రకారం 2018 ఫిబ్రవరి వరకూ కాంస్టాటైన్ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఎఐఎఫ్ఎఫ్ కార్యవర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కాంట్రాక్టు విధి విధానాలు, కాంస్టాటైన్ విధులు తదితర అంశాలపై ఆయనతో ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ ఘోష్ కలుసుకుని చర్చించారని తెలుస్తున్నది.
జట్టుకు తర్ఫీదు విషయమై ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షించిన తర్వాతే ఆయనను కోచ్గా కొనసాగిస్తామని ఎఐఎఫ్ఎఫ్ వర్గాలు తెలిపాయి. కాంస్టాటైన్ కూడా తన కాంట్రాక్ట్ కొనసాగుతుందని ఆశాభావంతో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2015 నుంచి భారత్ ఫుట్ బాల్ జాతీతయ జట్టుకు కోచ్ గా కాంస్టాటైన్ వ్యవహరిస్తున్నాడు.
ఈ వారాంతంలోగా ఎఐఎఫ్ఎఫ్ తో ఈ విషయమై కాంస్టాటైన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందుకు కుదుర్చుకున్న కాంట్రాక్ట్ వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగిసిపోనున్నది. అయితే కోచ్గా కాంస్టాటైన్ జట్టులో స్ఫూర్తి నింపడంలో పూర్తిగా విఫలమయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వరల్డ్ కప్లో గానీ, ఆసియా కప్ క్వాలిఫయర్స్ స్థాయికి దూసుకెళ్లేలా భారత జట్టును అభివ్రుద్ధి చేయడంలో విఫలమయ్యాడు. ఆసియా కప్ గ్రూప్ డీలో ఆసియా హెవీ వెయిట్స్ ఇరాన్, ఒమన్ తర్వాత గువాం కింద భారత్ చోటు దక్కించుకున్నది. గత జనవరిలో జరిగిన సాఫ్ఫ్ చాంపియన్ షిప్ టోర్నీలోనూ భారత జట్టుకు మార్గదర్శిగా వ్యవహరించిన కాంస్టాటైన్ ఆధ్వర్యంలోనూ మెరుగైన ఫలితాలేమీ సాధించలేదు.

ఆ చాంపియన్ షిప్ టోర్నీ ఫైనల్స్ మ్యాచ్ లో భారత్ జట్టు, ఆప్ఘనిస్తాన్ జట్టు చేతిలో 1- 0 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. అయితే ఎఐఎఫ్ఎఫ్ మాత్రం ఓవరాల్గా జట్టు ప్రతిభను పెంపొందించడంలో కాంస్టాటైన్ స్ఫూర్తిదాయక ఫలితాలు సాధిస్తున్నాడని విశ్వసిస్తోంది. మళ్లీ కాంస్టాటైన్ ను కోచ్ గా నియమించే విషయమై ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రిఫరీ నిక్ వాల్డ్రోన్కు హబాస్ దన్ను
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ప్రధాన జట్ల హెడ్ కోచ్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ రిఫరీ నిక్ వాల్డ్రోన్కు ఎఫ్ సి పుణె జట్టు మేనేజర్ ఆంటోనియో హబాస్ మద్దతు లభించింది. చిలీలో గత ఏడాది జరిగిన ఫిఫా యూ - 17 వరల్డ్ కప్ టోర్నీకి ఫిఫా న్యూజిలాండ్ నుంచి ఎంపిక చేసిన రిఫరీల్లో నిక్ వాల్డ్రోన్ ఒకరు. నిక్ వాల్డ్రోన్ తోపాటు అసిస్టెంట్ రిఫరీ గ్లెన్ లోచ్రీ కూడా న్యూజిలాండ్ వాసే.
నిక్ వాల్డ్రోన్ వ్యవహారశైలిపై ఎఫ్ సి గోవా చీఫ్ కోచ్ జికో విమర్శల వర్షం కురిపించాడు. కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 2 - 1 స్కోర్ తేడాతో ఓటమి పాలు కావడానికి రిఫరీ అనుసరించిన విధానమేనని జికో ఆరోపించాడు. మ్యాచ్ టైం ముగిసిన తర్వాత అదనపు తొమ్మిది నిమిషాల్లో తన కుర్రాళ్లిద్దరు చేసిన గోల్ ను తిరస్కరించిన వైనంపై జికో మండిపడుతున్నాడు.
గత వారమే ఐఎస్ఎల్ టోర్నీ రిఫరీగా నియమితుడైన నిక్ వాల్డ్రోన్ను అభినందిస్తున్నానంటూనే వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. చెన్నైయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి తర్వాత హబాస్ మీడియాతో మాట్లాడుతూ రిఫరీని అభినందిస్తున్నానన్నారు. మాకు పది పాయింట్లు మాత్రమే రావచ్చు గానీ, రిఫరీ వ్యవహార శైలిగా సరిగ్గానే ఉందని హబాస్ తెలిపాడు.
న్యూజిలాండ్ నుంచి దిగుమతయ్యే కోచ్ల వ్యవహార శైలి ఇలాగే ఉంటుందని జికో వ్యాఖ్యానించాడు. బ్రెజిల్ వారితో ఇటువంటి సమస్యలు తలెత్తబోవని చెప్పాడు. నిక్ వాల్డ్రోన్ సహా ఇతర రిఫరీలపై కూడా జికోతోపాటు ఐఎస్ఎల్ ఫ్రాంచైసీల కోచ్లు స్టీవ్ కొప్పెల్, జోస్ మొలీనా తదితరులు మండిపోతున్నారు.