హైదరాబాద్: బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే దేశీ వాలీ లీగ్ ఐపీఎల్. ఐపీఎల్ వేలం నుంచి ఫైనల్ మ్యాచ్ ముగిసే వరకూ ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ. అంతటి క్రేజ్ ఐపీఎల్ అంటే.. ఇందులో మ్యాచ్పై అభిమానంతో చూసే వాళ్లుంటే బెట్టింగ్ రాయుళ్లు కొందరుంటారు. ఇలా.. బెట్టింగ్లతో భారీగా సంపాదించేవాళ్లు, బతుకు బుగ్గిపాలు చేసుకునే వాళ్ల గురించి లీగ్ జరుగుతున్నంత కాలం వింటూనే ఉంటాం. ఎంతైనా, అది మన దేశంలో జరిగే లీగ్ కాబట్టి అంత క్రేజ్!!
మరి చైనా దేశంలో ఆ జట్టు ఫిఫా వరల్డ్ కప్లో ఆడకపోయినా అదే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు చైనావాసులు. పోనీ.. ఫుట్బాల్ అంటే ఆసక్తితో చూస్తుండటం ఓ కారణం అనుకుంటే పొరబడినట్లే. వాళ్లు చేస్తుంది అక్షరాల బెట్టింగ్. చైనాలోని షాంఘై నగరంలోని దుకాణాల్లో ఫుట్బాల్ ప్రపంచకప్నకు సంబంధించిన చార్టులు.. పదులు కొద్దీ కంప్యూటర్లు.. మ్యాచ్లను ఆసక్తిగా తిలకిస్తున్న అభిమానులు కనిపిస్తుంటారు.
ఫుట్బాల్ ప్రపంచకప్ వచ్చిందంటే చాలు చైనాలో బెట్టింగ్ జోరందుకుంటుంది. అక్కడ బెట్టింగ్ చట్ట విరుద్ధం అయినప్పటికీ అధికారులు అండదండలతోనే ఈ దందా కొనసాగుతోంది. ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వేసిన బెట్టింగ్ల మొత్తం గత ప్రపంచకప్ మొత్తం బెట్టింగ్ల కంటే ఎక్కువగా నమోదవడం విశేషం. జులై 1 నాటికే దాదాపు రూ.29వేల కోట్లు బెట్టింగ్లో పెట్టారు.
గత ప్రపంచకప్ మొత్తం బెట్టింగ్ (రూ.11వేల కోట్లు) కంటే ఇది రెండు రెట్ల కన్నా ఎక్కువ. మరోవైపు ఆ దేశ క్రీడా సంఘాలే తమ అథ్లెట్లకు మెరుగైన వసతుల కల్పన కోసం ఈ బెట్టింగ్ వ్యవస్థను నడిపిస్తున్నాయి. ఇవి కాకుండా అండర్ గ్రౌండ్, గ్యాంబ్లింగ్ల ద్వారా జరిగే బెట్టింగ్కు లెక్కేలేదు. అర్జెంటీనాపై ఫ్రాన్స్ విజయం సాధించడంతో రూ.10 వేలు నష్టపోయానని గావో అనే వ్యక్తి తెలిపాడు.