కోల్కతా: డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ మాజీ చాంప్ అట్లెంటికో డీ కోల్కతా జట్ల మధ్య ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ నువ్వా నేనా? అన్నట్లు సాగడంతో ఫుట్బాల్ ప్రేమికుల్లో ఉత్కంఠ నెలకొన్నది. మ్యాచ్ ముగిసే సమయానికి 2-2 స్కోర్తో సమ ఉజ్జీలుగా నిలవడం.. తర్వాత మూడు నిమిషాలు అదనపు సమయం కేటాయించినా ఫలితంలో మార్పు లేకపోవడం ఆయా జట్ల పోరాట పటిమను తెలియజేస్తున్నది.
మ్యాచ్ ఫలితం డ్రాగా ముగియడం ఇరు జట్ల కోచ్లకు సంతృప్తినిచ్చింది. చెన్నై ఆటగాళ్లు జయేశ్ 66వ నిమిషంలో, ముల్డర్ 70వ నిమిషంలో గోల్స్ చేయగా, కోల్కతాలోని దౌటీ 59వ నిమిషంలో, హూమ్ 86వ నిమిషంలో గోల్స్ సాధించారు. ఈ మ్యాచ్లో ఆసక్తికర పరిణామం ఏమిటంటే కోల్కతా గోల్స్ చేసిన నాలుగు నిమిషాల గడువులోపే చెన్నై కుర్రాళ్లు ధీటుగా స్పందించి గోల్స్తో పాయింట్లు సాధించడమే.
కొత్త దృక్పథంతో కోల్కతా జట్టు రంగంలోకి దిగితే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై కీలకమైన ఇంద్రజాలికులు ఇలానో, జాన్ స్టీవెన్ మెండోజాలు లేకుండానే బరిలోకి దిగినా ప్రత్యర్థితో సై అంటే సై అని నిలిచింది. చెన్నై జట్టులో ఏడుగురు క్రీడాకారులు రంగ ప్రవేశంచేస్తే వారిలో ఐదుగురు విదేశీయులు. హమంజోత్సింగ్ ఖబ్రా, థోయిసింగ్ వంటి ఫస్ట్టైమ్ రెగ్యులర్స్ పక్కకు తప్పించారు.

కోల్కతా నూతన జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన జోస్ మొలీనా తన ఫ్రాంచైసీ ఆటగాళ్లతో సురక్షితమైన ఆటకు ప్రాధాన్యం ఇవ్వడం ఆసక్తికర పరిణామం. గాయపడిన అఫ్టెంసే నాటో స్థానంలో బిక్రంజిత్ సింగ్కు చోటు కల్పించారు. కానీ ఈస్ట్బెంగాల్ సారధి రాబర్ట్ లాల్తామౌనా ప్రీ సీజన్ మ్యాచ్ల్లో చురుగ్గా పాల్గొన్నా... ఐ - లీగ్లో బెంగళూర్ ఎఫ్సి తరపున ఆడుతుండటంతో ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. ఆటపై పట్టు సాధించడంలో మొలీనా విజయవంతం అయ్యాడు.
తమ జట్టు తొలి గోల్ చేసినప్పుడు ఆశ్చర్యపోవాల్సి వచ్చిందని మొలీనా వ్యాఖ్యానించారంటే ఒక్కోసారి అదృష్టం ఎలా తలుపు తడుతుందో అర్థమవుతుంది. జట్టును సరైన దిశలో నడిపినందుకు సారధి బోర్జా ఫెర్నాండేజ్ను మొలీనా అభినందించాడు. క్రీడాకారులకు పాస్లు, అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించడం సానుకూల పరిణామం. అలాగే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఆట తీరు కూడా సంతృప్తికరంగానే ఉన్నదని మొలీనా పేర్కొనడం గమనార్హం. తిరి ఆటతీరును తప్పుబట్టేందుకు నిరాకరించాడు.
కోల్కతా రైట్ చానల్ ముందుచూపుతో వ్యవహరించడంతో జాన్ రైస్ జట్టుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. హెల్డర్ పొస్టిగ తన ప్రత్యర్థి జట్టు పట్ల చురుగ్గా వ్యవహరిస్తుండగా, అటాకింగ్ ఆటగాడు ఇయాన్హూం తెలివిగా వ్యవహరిస్తూ తన సహచరులకు పాస్లతో పాయింట్ల సాధన ద్వారా మ్యాచ్పై పట్టు సాధించేందుకు యత్నించారు.
కోల్కతా సారధి పలు దఫాలు కిక్కులతో గోల్స్కు చేసిన యత్నాలు విఫలమైతే ఇయాన్హుం మాత్రమే తెలివిగా వ్యవహరించగలిగాడు. మరోవైపు చెన్నైయిన్కు చెందిన జెజె, డేవిడ్ సుక్కీ కూడా ప్రత్యర్థికి స్వల్పంగా అవకాశాలు ఇచ్చినట్లు కనిపించింది. జట్టు ఆటపై సంతృప్తి వ్యక్తంచేసిన చెన్నై కోచ్ మాటరాజ్జీ ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొనడం గమనార్హం.
చాంపియన్షిప్ను కాపాడుకొనేందుకు తమ జట్టు ఒత్తిడికి గురవుతుందన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఏడాది మెండోజా తమకు అందుబాటులో లేకున్నా ప్రతి ఒక్కరూ గోల్ చేయగల సామర్థ్యం ఉందని రుజువు చేసుకోవాల్సి ఉందన్నాడు. 3 - 0 స్కోర్ తేడాతో పూర్తి కావాల్సిన మ్యాచ్ డ్రాగా ముగిసిందని పేర్కొన్నాడు.
బ్రేక్ తర్వాత గోల్స్తో పట్టు సాధించి కోల్కతా విసిరిన సవాల్కు చెన్నై కుర్రాళ్లు ధీటుగానే స్పందించారు. జయేశ్రాణె, కోటల్తో కలిసి జెజె ఆఫ్సైడ్ ట్రాప్ స్పాయిలింగ్చేసి మరీ పాయింట్ సాధించారు. ఆతిథ్య కోల్కతా ఆటగాళ్లు ఒక సాఫ్ట్ గోల్కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. తిరి నేతృత్వంలో దెబ్జిత్తో కలిసి హన్స్మల్డర్ తన గోల్ నెట్లోకి బంతిని కొట్టినా అది అతని కాళ్ల మధ్యే నిలిచిపోయింది.