
హైదరాబాద్: ప్రపంచం మొత్తం రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్లో మునిగి తేలుతోంది. రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్లు సాకర్ అభిమానులను సైతం అలరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత పుట్బాల్ జట్టు మాత్రం నిరాశలో కూరుకుపోయింది.
కారణం ఏంటంటే... ఆగస్టు 18 నుంచి ఇండోనేషియా వేదికగా ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఇండోనేసియా రాజధానిలో జరగనున్న ఈ ఆసియా గేమ్స్కు భారత పురుషుల, మహిళల ఫుట్బాల్ జట్లను పంపకూడదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయం తీసుకోవడమే.
గురువారం ప్రకటించిన ఆసియా గేమ్స్ ఫుట్బాల్ డ్రాలో భారత జట్లు లేకపోవడంతో ఈ విషయం స్పష్టమైంది. పతకం తెచ్చే అవకాశం లేదని భావించిన ఐఓఏ భారత ఫుట్బాల్ జట్లను ఆసియా క్రీడలకు పంపేందుకు నిరాకరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు వెల్లువెత్తాయి.
2019లో జరగనున్న ఏఎఫ్సీ ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి ఆసియా గేమ్స్ను సన్నాహకంగా ఉపయోగించుకుందామనుకున్న ఆలిండియా పుట్బాల్ ఫెడరేషన్కు ఇది ఊహించని దెబ్బేనని పుట్బాల్ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి గత కొన్నేళ్లుగా భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది.
ఫిఫా ర్యాంకింగ్స్లో 165 నుంచి 97వ స్థానానికి ఎగబాకడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు ఆసియాలో భారత పుట్బాల్ జట్టు 14వ ర్యాంకులో కొనసాగుతోంది. నాలుగేళ్ల వ్యవధిలోనే భారత పుట్బాల్ జట్టు 68 స్థానాలు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్కు భారత ఫుట్బాల్ జట్లను పంపకపోవడంపై ఐఓఏపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
భారత పుట్బాల్ జట్లపై ఐఓఏ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. ఐఓఏ దృష్టి లోపం ఉన్నవాడిగా వ్యవహరిస్తోందని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) విమర్శించింది. ఐఓఏ తీసుకున్న నిర్ణయాన్ని అధ్యక్షుడు నరిందర్ బాత్రా సమర్థించడం విశేషం.