హైదరాబాద్: ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరిస్ ముగిసింది. అక్టోబర్ 22 నుండి న్యూజిలాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆరంభం కానుంది. ఈ నేఫథ్యంలో లభించిన అతికొద్ది సమయాన్ని భారత క్రికెటర్లు ఇప్పుడు 'సెలబ్రిటీ క్లాసికో' ఫుట్బాల్ టోర్నీకి వినియోగించుకోనున్నారు.
విరాట్ కోహ్లీ ఫౌండేషన్ కోసం నిధులు సేకరించే క్రమంలో భాగంగా ఆదివారం అంధేరిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ జట్టుతో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్లు పాల్గొనున్నారు.
తాజాగా, ఈ టోర్నీలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జట్టు నుంచి వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను తప్పించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్ మాజీ సహ యజమాని అయిన రాజ్ కుంద్రాకు బీసీసీఐ షాకిచ్చింది.

2013లో ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా ఆడితే తమ ఆటగాళ్లను పంపబోమని బీసీసీఐ చెప్పడంతో కుంద్రాను ముందుగానే తప్పించారు. తనను ఫుట్బాల్ మ్యాచ్ నుంచి తప్పించిన విషయాన్ని ముంబై మిర్రర్కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాజ్ కుంద్రా తెలిపారు.
'సెలబ్రిటీ క్లాసికో ఫుట్బాల్ మ్యాచ్లో నేను ఆడితే బీసీసీఐ తమ ఆటగాళ్లను పంపమనే విషయాన్ని నాకు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహిస్తున్న జీఎస్ ఎంటర్టైన్మెంట్కు రాత పూర్వకంగా తెలియజేశా. కానీ వారి నుంచి కూడా సరైన సమాధానం లేదు' అని రాజ్ కుంద్రా అన్నారు.
'దాంతో ఫుట్బాల్ లీగ్కు దూరంగా ఉండాల్సి వస్తోంది. శుక్రవారం సాయంత్రం నాకు జీఎస్ ఎంటర్టైన్మెంట్ నుంచి కాల్ వచ్చింది. ఈ టోర్నీలో నేను గనుక పాల్గొంటే బీసీసీఐ తమ ఆటగాళ్లను పంపదని అన్నారు. దీంతో చేసేదేం లేక టోర్నీ నుంచి తప్పుకున్నా' అని రాజ్ కుంద్రా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ ఆల్ హార్ట్స్ ఎఫ్సీ జట్టుకి కెప్టెన్గా ఉండగా, ఆల్ స్టార్స్ ఎఫ్సీ జట్టుకు రణ్బీర్ కపూర్ నేతృత్వం వహించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఇప్పటి నుంచే ధోని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడుతూ పెద్ద మైదానాల్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన అనుభవం లేదన్నాడు.