
హైదరాబాద్: అదో ప్రఖ్యాత ఫుట్బాల్ టోర్నమెంట్ (లిబర్టాడోర్స్ సాకర్ టోర్నమెంట్) ఇరు జట్లు మంచి బలమైన జట్లు. అభిమానుల హోరు మధ్య ఓ మహిళా జర్నలిస్టు బ్రూనా డిల్ట్రా ఆ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అక్కడికి వెళ్లింది. అక్కడికి వచ్చిన అభిమానులను అడిగి అభిప్రాయాలను తెలుసుకుంటుంది. ఇలా రిపోర్టింగ్ చేస్తుండగానే మధ్యలో ఓ ప్లేయర్ విచక్షణ మరిచాడు.
ఆమె పెదాలను ముద్దు పెట్టబోయాడు. అక్కడ జరిగిన హఠాత్పరిణామాన్ని క్షణాల్లో తెలుసుకున్న ఆమె ఒక్కసారిగా తప్పుకుంది. క్రీడా స్ఫూర్తిని మరచి క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించినందుకు క్షమాపణ కూడా చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ ఫుట్బాల్ ప్లేయర్. జరిగిన పరాభవంతో పనిని ఆపేయకుండా ఆ మహిళా జర్నలిస్టు కార్యక్రమాన్ని ముగించింది.
అయితే ఇలా జరగడం మొదటిసారేం కాదు. మమ్మల్ని ఎందుకు గౌరవించరంటూ.. తను సోషల్ మీడియా వేదికగా ఆవేదనను వెల్లగక్కింది. ఆ వీడియోకు సహ మహిళా జర్నలిస్టులు స్పందించారు. సుమారు 50మంది వరకు తమ తమ అభిప్రాయాలను తెలుపుతూ.. మరో వీడియో సందేశాన్ని పంపారు. దీంతో అక్కడ మీటూ ఉద్యమం మొదలైంది.
ఓ మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టుతో ప్లేయర్లు ఇలాగా ప్రవర్తిస్తారా అని మిగతా జర్నలిస్టులూ ప్రశ్నిస్తున్నారు. బ్రూనాలాగే వేధింపులకు గురైన కొందరు మహిళా స్పోర్ట్స్ జర్నలిస్టులు తాజాగా ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.