ఈసారి ఫిఫా వరల్డ్ కప్లో ఫేవరెట్ జట్టు ఏదంటే చాలా మంది చెప్పే పేరు బ్రెజిల్. వరుస విజయాలతో జోరుమీదున్న ఈ జట్టుకు ఖతర్ వేదికగా జరుగుతున్న టోర్నీలో కూడా శుభారంభం చేసింది. అయితే ఇప్పుడు ఆ జట్టుకు దిమ్మతిరిగే షాకింగ్ వార్త తెలిసింది. ఆ జట్టు ఐకానిక్ ప్లేయర్ నెయ్మార్ ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తొలి మ్యాచ్లో గాయం కారణంగా అతను ఈ టోర్నీలో ఇప్పుడప్పుడే ఆడబోడని తెలుస్తోంది.
టోర్నీలో తమ తొలి మ్యాచ్లో సెర్బియాను ఎదుర్కొన్న బ్రెజిల్ 2-0 తేడాతో నెగ్గింది. ఈ మ్యాచ్లో నెయ్మార్ రికార్డు స్థాయిలో 9 ఫౌల్స్ చేశాడు. ఆ తర్వాత నెయ్మార్ను ప్రత్యర్థి ఆటగాడు బలంగా ట్యాకిల్ చేశాడు. దీంతో మ్యాచ్ 80వ నిమిషంలో గాయంతో విలవిల్లాడుతున్న అతని స్థానంలో ఆంటనీ మైదానంలోకి వచ్చాడు. ఆట ముగిసే వరకు డగౌట్లో కూర్చొని ఐస్ప్యాక్తో చికిత్స చేయించుకున్న నెయ్మార్.. తమ జట్టు గెలిచిన తర్వాత లోపలకు వెళ్లిపోయాడు.
మ్యాచ్ ముగిసిన తర్వాత అతనికి కొన్ని టెస్టులు చేసిన జట్టు ఫిజియో విభాగం.. హోటల్లోనే అతనికి కొంత చికిత్స కూడా అందించిందట. 'ఆ మ్యాచ్లో రెండు గోల్స్ చేసే వరకు నెయ్మార్ నొప్పిని భరిస్తూ జట్టు కోసం ఆడాడు. ముఖ్యంగా రెండో గోల్ సమయానికి అతని కాలు విపరీతంగా నొప్పి పెట్టింది. అయినా మైదానంలోనే ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు' అని బ్రెజిల్ కోచ్ టైట్ వెల్లడించాడు. అయితే ఇప్పుడు జట్టుకు దూరమైనా కూడా నాకౌట్ మ్యాచుల సమయానికి మళ్లీ నెయ్మార్ తన జట్టుతో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. స్విట్జర్లాండ్, కామెరూన్ దేశాలతో జరిగే మ్యాచులకు నెయ్మార్ అందుబాటులో ఉండడు. ఆ తర్వాత నాకౌట్ దశలో మళ్లీ జట్టుతో కలుస్తాడని టీం మేనేజ్మెంట్ తెలిపింది.