
ప్రపంచకప్ ఫేవరెట్గా బరిలో దిగిన బ్రెజిల్కు గుండెకోత మిగిలింది. క్రొయేషియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్ ఓటమిపాలైంది. మ్యాచ్ ఆరంభం నుంచి నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈ క్రమంలోనే రెండు జట్లు సరైన అవకాశాలను సృష్టించుకోలేకపోయాయి. దీంతో తొలి హాఫ్ టైంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
రెండో హాఫ్ టైంలో ఎలాగైనా గోల్ చేయాలని రెండు జట్లు ప్రయత్నించాయి. కానీ అటు క్రొయేషియా, ఇటు బ్రెజిల్ అద్భుతమైన డిఫెన్స్తో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో రెండో సగం ఆట కూడా గోల్ లేకుండానే ముగిసింది. ఇలా 0-0తో ఆట ముగియడంతో అదనంగా 30 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇస్తున్నట్లు రిఫరీలు వెల్లడించారు. ఈ సమయంలో గోల్ చేసి ఎలాగైనా నెగ్గాలని రెండు జట్లు పోరాడాయి.

ఈ క్రమంలోనే ఎక్స్ట్రా టైం మొదటి అర్ధభాగంలోనే నెయ్మార్ తన సత్తా చూపించాడు. బ్రెజిల్ తరఫున తొలి గోల్ సాధించాడు. దీంతో విజయం తమదే అని బ్రెజిల్ నమ్మింది. కానీ క్రొయేషియా తాము కూడా ఏమాత్రరం తక్కువ కాదని నిరూపించింది. కాసేపటికే క్రొయేషియా ప్లేయర్ పెట్కావిక్ తను కూడా గోల్ చేసి స్కోర్లు సమం చేశాడు. దీంతో ఎక్స్ట్రా టైం ముగిసే సమయానికి రెండు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.
ఎక్స్ట్రా టైంలో కూడా ఫలితం తేలకపోవడంతో పెనాల్టీ షూటవుట్ నిర్వహించారు. దీనిలో బ్రెజిల్ ఆటగాళ్లు రోడ్రిగో, మార్కినో గోల్ చేయడంలో విఫలమయ్యారు. అదే సమయంలో క్రొయేషియా తరఫున నికోలా వ్లాసిక్, లావ్రో మేయర్, లూకా మాడ్రిక్, మిస్లావ్ ఆర్సిక్ నలుగురూ గోల్స్ చేశారు. దీంతో క్రొయేషియా జట్టు 4-2 తేడాతో బ్రెజిల్ను ఓడించింది. ఈ ఫలితం చూసిన బ్రెజిల్ అభిమానుల గుండె బద్దలైంది. వరల్డ్ కప్ గెలుస్తుందనుకున్న తమ జట్టు ఇలా క్వార్టర్స్లోనే ఇంటి దారి పట్టడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. క్రొయేషియా జట్టు సెమీఫైనల్స్లో అర్జెంటీనాతో తలపడుతుంది.