సిడ్నీ: ప్రపంచ కప్లో భాగంగా భారత్ - పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా సిడ్నీలో ఘర్షణ జరిగింది. సిడ్నీలోని మేరీల్యాండ్స్ క్లబ్లో దాదాపు 180 మంది అభిమానులు టీవీలో ఈ మ్యాచ్ను తిలకించారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగింది.
40 మంది బాహాబాహీ తలపడ్డారు. వీరిలో నలుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించి అరెస్టు చేయవలసి ఉంది.

గాయపడ్డ వారిలో ముగ్గురిని వెస్ట్ మీడ్ ఆసుపత్రికి, ఒకరిని అబర్న్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆదివారం జరిగిన భారత్ - పాక్ మ్యాచులో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ను వంద కోట్ల మందికి పైగా చూశారు.
భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ ఓడిన నేపథ్యంలో కొందరు పాక్ అభిమానులు భారత్ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో భారత్, పాక్ అభిమానుల మధ్య గొడవ జరిగిందని సమాచారం.