హైదరాబాద్: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సలహాదారు పదవి నుంచి భారత మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియాను తప్పించారు. రెండేళ్ల పాటు భైచుంగ్ భూటియా సలహాదారుగా ఈ పదవిలో ఉన్నారు.
భూటియాతో చేసుకున్న ఒప్పందం గత డిసెంబర్లో ముగిసిందని, అయితే మళ్లీ ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని ఏఐఎఫ్ఎఫ్ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్కు సాంకేతిక సలహాదారుడిగా కూడా భూటియా పనిచేశారు.

ఈ సమయంలో స్టీఫెన్ కాన్స్టాంటైన్ భారత పుట్బాల్ జట్టుకు మళ్లీ కోచ్గా రావడంలో భూటియా కీలకపాత్ర పోషించారు. అయితే ఏఐఎఫ్ఎఫ్ ప్రముఖులతో అభిప్రాయబేధాలు రావడంతోనే భూటియా కాంట్రాక్ట్ను పొడిగించలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరోవైపు భారత అండర్ 17 కోచ్గా నికొలాయ్ ఆడమ్ను తప్పించిన తర్వాత ఆయన స్థానంలో కామ్ టోయల్ను కోచ్గా తీసుకురావాలని భూటియా సూచించాడు. అయితే భూటియా సూచనలను ఏఐఎఫ్ఎఫ్ పట్టించుకోలేదు.
అంతేకాదు అండర్ 17 కోచ్గా నికొలాయ్ ఆడమ్ను తప్పించి అతడి స్ధానంలో పోర్చుగల్కు చెందిన లూయిస్ నార్టన్ డి మాటోస్ను కోచ్గా ఏఐఎఫ్ఎఫ్ నియమించింది.