రీసెంట్ గా జరిగిన ఓ ప్రతిష్టాత్మక ట్రోఫీలో ఆ జట్టు రికార్డ్ స్థాయిలో 33వ సారి విజయాన్ని అందుకుంది. దీంతో ప్రభుత్వం ఆ జట్టులోని 22 మంది ఆటగాళ్లకు భారీ నజరానాతో పాటు పోలీస్ ఉద్యోగాలను ప్రకటించింది. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం.
సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ ను ముద్దాడిన బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి భారీ నజరాను ప్రకటించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను అందించనున్నట్లు తెలిపింది. ఈ నేషనల్ ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ టోర్నీలో బెంగాల్ జట్టు రికార్డు స్థాయిలో 33వసారి ట్రోఫీని గెలుచుకుంది. ఈ సందర్భంగా గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు పోలీస్ విభాగంలో ఉద్యోగాలను ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్లేయర్స్ ను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)లుగా నియమించనున్నట్లు తెలిపింది.

కాగా, ఇటీవలే హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా సంతోష్ ట్రోఫీ ఫైనల్ జరిగింది. ఈ తుది పోరులో 1-0 తేడాతో కేరళను ఓడించి బెంగాల్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ రికార్డు స్థాయిలో 33వ సారి ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది. వాస్తవానికి ఈ తుదిపోరులో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఇంజూరీ సమయంలో రాబి (94వ) బంతిని నెట్లోకి కొట్టి బెంగాల్ కు విజయాన్ని ఖాయం చేశాడు. ఆదిత్య హెడర్తో బంతిని రాబి సమీపానికి పంపాడు. దీంతో అతడు వెంటనే గోల్ చేసేశాడు.