బార్సిలోనా: వచ్చే ఏడాది లా లీగ లీగ్ రూపురేఖలే మార్చేస్తామని ఎఫ్ సి బార్సిలోనా హెడ్ కోచ్ లూయిస్ ఎన్రిక్యు సంచలన వ్యాఖ్యలు చేశాడు. లీగ్ ఫస్టాఫ్ ముగిసిన తర్వాత ఆరు పాయింట్లు తక్కువతో రియల్ మాడ్రిడ్ కంటే పాయింట్ల పట్టికలో ఒక స్థానం వెనుక బడి ఉన్న బార్సిలోనా విజ్రుంభిస్తుందని మీడియాతో అన్నాడు. ఈ ఏడాది టోర్నీలో ఎన్రిక్యు శిష్యులు గత ఐదు మ్యాచ్ ల్లో మూడింటిని డ్రాగా ముగించారు.
సంప్రదాయ ప్రత్యర్థి రియల్ మాడ్రిడ్ జట్టుతో సమానంగా పోటీ పడటంలో వెనుకబడ్డారు. 16 మ్యాచ్ లు ఆడిన బార్సిలోనా జట్టు కేవలం 37 పాయింట్లు మాత్రమే పొందింది. లీగ్ దశలో ఎఫ్ సి బార్సిలోనా కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉండటం గమనార్హం. 'మేము పరిస్థితులను మార్చివేయగల సామర్థ్యం కలిగి ఉన్నామని భావిస్తున్నా. మా ముందు చక్కని సొగసైన లా లీగ సవాల్ ఎదురుచూస్తుందని అంచనా వేస్తున్నా. మేం రియల్ మాడ్రిడ్ కంటే ఆరు పాయింట్లు వెనుకబడి ఉన్నాం. ఒకవేళ మేం పరిస్థితిని అంచనా వేసి ముందడుగు వేయగలమా? అని పరిశీలిస్తాం' అని వ్యాఖ్యానించాడు.
'ఈ టీం అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొన్నది. ఇటీవల మేం చాలా ట్రోఫీలు గెలుచుకున్నాం. వారి (రియల్ మాడ్రిడ్)ని గెలువడం అంత తేలికేం కాదు' అని అన్నాడు. తాము బెస్ట్ ఫుట్ బాల్ ఆడటం వల్లే ట్రోఫీలు గెలుచుకోగలిగామన్నాడు. లా లీగ డిఫెండింగ్ చాంపియన్ గా ఉన్న బార్సిలోనా ఉమ్మడి ఆలోచన గల ప్లేయర్ల కలయిక అని, తమపై ఫ్యాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్నాడు.

'ట్రోఫీని గెలుచుకునేందుకు నా వద్ద పలు వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని రొటేట్ చేస్తూ ఉంటా. ప్రస్తుత సీజన్ ముగింపులో నా వ్యూహాలను ప్రత్యర్థి జట్టుకు రుచి చూపిస్తా' అని హెచ్చరికలు జారీచేశాడు. ఇంతకుముందు రియల్ మాడ్రిడ్, బార్సిలోనా జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఎన్రిక్యు తమది చాలా ఉత్తమ టీం, ఉత్తమ ప్లేయర్లతో కూడిన బెస్ట్ క్లబ్ అని అభివర్ణించాడు.
అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియానెల్ మెస్సీ తమ జట్టుకు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నాడు. మెస్సీ మాదిరిగా మరే ఫుట్ బాల్ క్రీడాకారుడు ఇంతవరకు ఆడలేదని పేర్కొన్నాడు. తమ జట్టులో చేరిన నూతన ఫార్వర్డ్ ప్లేయర్ పాకో అల్సస్సర్ తన వంతు విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
కానీ ప్రత్యర్థి జట్లు ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని చెప్పాడు. దీంతో ఆందోళనకు గురవుతున్న పాకో అలస్సర్ను సంయమనం పాటించాలని తాను సూచిస్తున్నాన్నాడు. భవిష్యత్లో ఆయన చాలా టఫ్ గా ఉంటాడని అంగీకరించాడు.