పారిస్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రతిష్టాత్మక బాలెన్ డీ ఓర్ (గోల్డెన్ బాల్) ఫుట్బాల్ పురస్కారాల ప్రదానం ఈ ఏడాది రద్దయింది. వైరస్ వల్ల ఈ ఏడాది సాకర్ సీజన్కు అంతరాయం ఏర్పడడంతో అవార్డులను ఇవ్వడం లేదని నిర్వాహక ఫ్రాన్స్ ఫుట్బాల్ సంఘం సోమవారం ప్రకటించింది. మరోవైపు 2018 నుంచి ఇస్తున్న మహిళల అవార్డులను కూడా ఈసారి రద్దు చేశారు.
1956లో స్టాన్లీ మాథ్యూస్ గెలిచినప్పటి నుంచి ప్రతి ఏడాది దిగ్విజయంగా జరుగుతున్న 'బాలెన్ డి ఓర్' అవార్డుల వేడుక రద్దు కావడం ఇదే తొలిసారి. అవార్డులకున్న విశిష్టత దృష్ట్యా టోర్నీలు జరుగకుండా ప్రదానం చేయకూడదని అనుకున్నామని అని ఫ్రాన్స్ ఫుట్బాల్ ఎడిటర్ పాస్కల్ ఫెర్రె అన్నాడు. ప్రతి ఏడాది ప్రపంచ అత్యుత్తమ ఫుట్బాలర్లు 'గోల్డెన్ బాల్' అవార్డును అందుకుంటారు.
1956 నుంచి ఫ్రాన్స్ ఫుట్బాల్ మ్యాగజైన్ ఈ పురస్కారాన్ని క్రమం తప్పకుండా ఇస్తోంది. తొలి అవార్డును స్టాన్లీ మాథ్యూ అందుకున్నాడు. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఈ పురస్కారాన్ని సాధించగా.. మరో దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అయిదుసార్లు అందుకున్నాడు. 2018 నుంచి మహిళలకు కూడా ఈ అవార్డును అందజేస్తున్న విషయం తెలిసిందే.
'ఇది చాలా విచిత్రమైన సంవత్సరం. బాలెన్ డీ ఓర్ రద్దును సాధారణమైనదిగా పరిగణించలేము. కనీసం రెండు నెలల క్రితం నుండే చర్చలు మొదలుపెట్టాం. తేలికగా తీసుకున్న నిర్ణయం కాదు. ఈ ఏడాది అవార్డు ఇవ్వనందుకు చాలా భాధగా ఉంది. మహమ్మారి సమయంలో ఆట నియమాలు సవరించబడినందున అవార్డు కూడా ప్రభావితమైంది. జనవరి, ఫిబ్రవరిలో మైదానం మొత్తం ప్రేక్షకులతో నిండగా.. మే నుండి ఖాళీ మైదానాల్లో ఆడాల్సి వస్తుంది' అని ఫ్రాన్స్ ఫుట్బాల్ సంఘం ఎడిటర్ పాస్కల్ ఫెర్రే ఒక టెలిఫోన్ ఇంటర్వ్యూలో చెప్పారు.
చేతులెత్తేసిన విండీస్ బ్యాట్స్మెన్.. రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయం.. సిరీస్ 1-1తో సమం