2023లో జరగనున్న మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ ఆతిథ్యాన్ని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు దక్కించుకున్నాయని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో గురువారం ప్రకటించారు. రెండు దేశాల్లో కలిపి మొత్తం 12 నగరాల్లోని 13 స్టేడియాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ప్రపంచకప్ మ్యాచ్లు 2023, జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు జరుగుతాయి.
2019లో ఫ్రాన్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్లో 24 జట్లు పాల్గొన్నాయి. అయితే మొదటిసారిగా 2023లో జరగనున్న ప్రపంచకప్లో 32 జట్లు పాల్గొంటాయి. మొత్తం 32 జట్లను 8 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లు ఉంటాయి. ఇక మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్కు సంబందించిన క్వాలిఫయింగ్ మ్యాచులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ను అమెరికా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు గెలుపొందింది. గత రెండు ప్రపంచకప్లలో (2019, 2015) అమెరికా విజయం సాధించింది.
ఈ ఏడాది నవంబరు 2 నుంచి 21 వరకు భారత్లో అండర్-17 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీ జరగాల్సింది. అయితే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు టోర్నీని నిర్వహించనున్నారు. కోల్కతా, గువాహటి, భువనేశ్వర్, అహ్మదాబాద్, ముంబైలలో ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతాయి. మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో భారత మహిళల జట్టు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఇక 2022లో జరగనున్న ఫిఫా ప్రపంచకప్కు ఖతార్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.
సరికొత్త లుక్తో అదరగొట్టిన టెస్టు స్పెషలిస్ట్.. చూస్తే మతిపోవాల్సిందే!!