న్యూఢిల్లీ: యావత్ భారతావని అంతా మరో అద్భుతమైన వేడుక నిర్వహణకు వేదిక కానున్నది. క్రికెట్, టెన్నిస్, బాల్బాడ్మింటన్ మాదిరిగానే ఫుట్బాల్ కూడా ప్రధాన క్రీడ అని నిరూపించేందుకు.. క్రీడాభిమానులకు నువిందుచేసేందుకు దేశవ్యాప్తంగా దాని ప్రోత్సాహానికి ఏర్పాటైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్ ప్రారంభానికి మరో 12 రోజుల గడువు మాత్రమే ఉంది.
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 18 వరకు అవిశ్రాంతంగా ఈ క్రీడా సంరంభం కొనసాగనున్నది. పూర్తిగా స్వదేశీ లీగ్ రూపంలో జరిగే ఐఎస్ఎల్ ప్రచారకర్తలైన ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ షెడ్యూల్ను ప్రకటించింది.
79 రోజులు నిరంతరం సాగే ఈ టోర్నీలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కూడా ఉన్నాయి. తొలిదశ సెమీ ఫైనల్స్ డిసెంబర్ 10, 11 తేదీల్లో, మలి దశ సెమీ ఫైనల్స్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరుగుతాయి. ఫైనల్స్ డిసెంబర్ 18న జరగనున్నది. మ్యాచ్లన్నీ ప్రతిరోజూ రాత్రి ఏడు గంటలకు మొదలవుతాయి.
మూడో ఏడాది కూడా బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఫ్రాంచైజీ క్లబ్ 'నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి' జట్టు.. భారత క్రికెట్ దేవుడిగా పరిగణించే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సారధ్యంలోని 'కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సి' జట్టు అక్టోబర్ ఒకటో తేదీన అసోం రాజధాని గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి జరగనున్న ఐఎస్ఎల్ టోర్నీలో ఆయా జట్ల విజయావకాశాలపై అవలోకనం..
ద్వితీయ ఐఎస్ఎల్ టోర్నీ చాంపియన్గా నిలిచిన చెన్నయిన్ ఎఫ్సి టీమ్ మరోసారి టైటిల్ను నిలబెట్టుకొనేందుకు సంసిద్ధం అవుతున్నది. డిఫెన్స్లో ఆరితేరిన బెర్నాడ్ మెండీ, జాన్ ఆర్నె రీస్.. ఫార్వర్డ్ లైన్లో జేజే.. మిడ్ఫీల్డ్లో ఒమాగ్బెమీ తమ ప్రత్యర్థి జట్ల డిఫెన్స్ ఎత్తులను అత్యంత ఉత్సాహంతో తేలిగ్గానే ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉంది. అక్టోబర్ రెండో తేదీన చెన్నై జట్టు అట్లెంటికో డి కోల్కతాతో తలపడుతుంది.
ఈసారి టైటిల్ కోసం గోవా తహతహ
2015 సీజన్లో చెన్నయియిన్ ఎఫ్సి చేతిలో ఓటమి పాలైన ఎఫ్సి గోవా జట్టు మరింత ప్రేరణతో ఈ దఫా టోర్నీ చాంపియన్ షిప్ టైటిల్ను గెలుచుకొనేందుకు ఉవ్విళ్లూరుతున్నది. లైన్పై రోబిన్సింగ్, ఒలివియిరా ఆధ్వర్యంలో మిడ్ఫీల్డర్ రిచర్ల్యసన్ తదితరులు గల 'ఎఫ్సి గోవా' జట్టు ఈ ఏడాది చాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకొనేందుకు మెరుగైన అవకాశాలు కలిగి ఉంది.
లూసియో సారధ్యంలోని ఎఫ్సి గోవా జట్టు దూకుడుగా ఆడటంతోపాటు ఈ సీజన్లో కొన్ని దిగ్భ్రాంతికర సంచలనాలు సృష్టించే చాన్స్ ఉంది. మెరుగైన అవకాశాలు గల 'ఎఫ్సి గోవా' జట్టు వచ్చేనెల నాలుగో తేదీన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సితో తల పడనున్నది.

ముంబైకి అవకాశాలు పుష్కలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మాదిరిగానే ఐఎస్ఎల్లోనే ముంబై కేంద్రంగా ఆడుతున్న ముంబై సిటీ ఎఫ్సి జట్టుకు గత ఏడాది సీజన్లో ఆరో స్థానంలో నిలిచినా.. ఈసారి మాత్రం విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు. ప్రత్యర్థి జట్లకు గట్టి పోటీనిస్తుందని విశ్వసిస్తున్నారు. ఇప్పటివరకు సాగిన ప్రీ సీజన్ మ్యాచ్ల్లో ముంబై అన్ని జట్ల కంటే అజేయంగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. దుబాయ్ ఎస్సి జట్టుతో వచ్చేనెల 11న ముంబై సిటీ తల పడుతుంది. ముంబై జట్టులోని డియిగో ఫొర్లాన్కు గల ర్యాంక్ ఈ దఫా ఈ జట్టు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.
డిడియర్ జొకోరాతో నార్త్ ఈస్ట్ ఫేవరెట్!
ఐఎస్ఎల్ ద్వితీయ సీజన్లో ఐదో స్థానంతో సంతృప్తి పడిన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి జట్టు.. ఈ దఫా ఎలాగైనా 'ఐఎస్ఎల్ - 2016' టోర్నీ కిరీటాన్ని కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతున్నది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న నార్త్ ఈస్ట్ యునైటెడ్ జట్టు.. వచ్చేనెల ఒకటో తేదీన కేరళ బ్లాస్టర్స్తో వచ్చేనెల ఒకటో తేదీన తలపడటంతో ఐఎస్ఎల్ మూడో సీజన్ టోర్నీ మొదలవుతుంది. డిడియర్ జొకోరా లీడ్లో ఉన్న జట్టుకు ప్రతిభావంతుడైన కోచ్ నెలో వింగాడా ఉండటం ఈ దఫా కలిసి వచ్చే అవకాశం.
స్థిరంగా ఫుణె సిటీ
ప్రస్తుతం స్పెయిన్లో పర్యటిస్తున్న 'ఎఫ్సి పుణె సిటీ' జట్టు.. మిడ్ఫీల్డర్గా ఉన్న బ్రెజిలియన్ క్రీడాకారుడు జొన్నాతన్ లుక్కా, లీడింగ్లో ఉన్న ఈదూర్ గుడ్జాన్సెన్, డోయెలతో సుస్థిరత్వం కలిగి ఉంది. తద్వారా పుణె సిటీ ఎఫ్సి మూడో సీజన్లో జరగనున్న టోర్నీలో హాట్ ఫేవరెట్గానే బరిలోకి దిగనున్నది. గత ఏడాది ఏడో స్థానానికి పరిమితమైన పుణె సిటీ వచ్చేనెల మూడో తేదీన ముంబై సిటీ ఎఫ్తో ఆడుతుంది.
చైతన్యం పెంచుకున్న కేరళ బ్లాస్టర్స్
క్రితంసారి అట్టడుగు స్థానానికి పరిమితమైన కేరళ బ్లాస్టర్స్ తన శక్తి సామర్థ్యాలను మరింత చైతన్యపరుచుకుని ఈసారి శక్తిమంతమైన జట్టుగా రాటుదేలింది. కొత్తగా జట్టులో చేరిన హైతీ స్ట్రైకర్ నాజన్, డిడియార్ బోరిస్ కాడియో, ఔజిన్ డోయేలతోపాటు ఫార్వర్డ్ లైన్లో అంటోనియో గెర్మన్లతో జవసత్వాలు సంతరించుకున్నది. ప్రస్తుతం థాయిలాండ్ టూర్లో ఉన్న కేరళ బ్లాస్టర్స్ వచ్చేనెల ఒకటో తేదీన నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సితో తలపడుతుంది.
మరో టైటిల్ కోసం కోల్కతా వ్యూహం
తొలి సీజన్ విజేత అట్లెంటికో డీ కొల్కతాకి గత ఏడాది సెమీ ఫైనల్స్లో అదృష్టం ముఖం చాటేసింది. కొత్తగా జట్టులో చేరిన షిల్టన్ పాల్, విదేశీ ఆటగాళ్లు ఇయాన్ హుమె, బోర్జా ఫెర్నాండెజ్, అఫెంట్సీ నాటో, కొత్త ఆటగాడు స్టీఫెన్ పియర్సన్, దానీ మల్లో, పాబ్లో బురేరాలతో నూతన బలాలు సంతరించుకున్న కోల్కతా ఈ దఫా మిగతా జట్ల కంటే బలమైన టీమ్గా బరిలోకి దిగనున్నది.
ఈ సారి టోర్నీలో చెన్నయిన్ ఎఫ్సి జట్టుతో తొలిసారి అక్టోబర్ రెండో తేదీన తలపడుతుంది. ఈ నెల స్వీడిష్ క్లబ్ స్కెన్ ఐఎఫ్తో రికార్డు విజయం సాధించిన ఢిల్లీ డైనమోస్కు కోచ్ గిజాయంలుకా పెద్ద అండ. ఫ్లోరెంట్ మాలౌడా, మార్సెలో లైటే జట్టులో స్టార్ ఆటగాళ్లు. వారిలో లైటే స్కోరింగ్ విన్నర్గా పేరొందాడు. గత ఏడాది సెమీ ఫైనల్స్ వరకు దూసుకొచ్చిన ఢిల్లీ డైనమో ఈ దఫా విజేతగా ఏ ఒక్కరూ కొట్టిపారేయలేని విధంగా శక్తియుక్తులు సంతరించుకున్నది. ఆరో తేదీన చెన్నయిన్ ఎఫ్సితో తొలుత ఢిల్లీ డైనమో పోటీ పడుతుంది.
యావత్ భారతావని అంతా మరో అద్భుతమైన వేడుక నిర్వహణకు వేదిక కానున్నది. క్రికెట్, టెన్నిస్, బాల్బాడ్మింటన్ మాదిరిగానే ఫుట్బాల్ కూడా ప్రధాన క్రీడ అని నిరూపించేందుకు.. క్రీడాభిమానులకు నువిందుచేసేందుకు దేశవ్యాప్తంగా దాని ప్రోత్సాహానికి ఏర్పాటైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) మూడో సీజన్ ప్రారంభానికి మరో 12 రోజుల గడువు మాత్రమే ఉంది.