వరల్డ్ కప్లో తమ జట్టు ఓడిపోయిందని నిరసనలకు దిగారు ఆ దేశ ప్రజలు. భారీగా ప్రజలు ఇలా ఆందోళనలకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ గొడవను చల్లబరిచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టియర్ గ్యాస్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘటనలు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో వెలుగు చూశాయి. ఆ జట్టు ఫిఫా వరల్డ్ కప్లో మొరాకో చేతిలో ఓటమి పాలైంది.
ఈ ఓటమిని ఆ దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో ఒక కారు, రెండు ఎలక్ట్రిక్ బైకులకు నిప్పుపెట్టారు. సాయంత్రం 7 గంటల నాటికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రశాంతతను కాపాడటం కోసం పోలీసులు అధికారులు పెట్రోల్స్ తిరుగుతూ.. ప్రజలు ఎక్కడా గుంపులు కట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిరసనకారుల దాడుల్లో ఒక జర్నలిస్టు సహా పలువురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కర్రలు తదితర ఆయుధాలు పట్టుకొని వీధుల్లోకి వచ్చిన ప్రజలు.. వాహనాలకు నిప్పుపెట్టారని, అతి కష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని తెలుస్తోంది.
వరల్డ్ కప్ గ్రూప్-ఎఫ్లో భాగంగా బెల్జియం, మొరాకో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఎవరూ కూడా మొరాకో విజయం సాధిస్తుందని అనుకోలేదు. అయితే ఈ ప్రపంచకప్ ఆరంభంలోనే పలు సంచలనాలు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో మొరాకో కూడా బెల్జియంను 2-0 తేడాతో ఓడించింది. ఆట మొదటి నుంచి మొరాకో జట్టు ఎటాకింగ్ గేమ్ ఆడింది. అయితే బెల్జియం చక్కగా డిఫెండ్ చేసుకోవడంతో తొలి అర్ధభాగంలో ఎలాంటి గోల్స్ నమోదవలేదు.
అయితే సెకండ్ హాఫ్లో మరింత చెలరేగిన మొరాకో జట్టు దూకుడు పెంచింది. రెండు గోల్స్ సాధించి బెల్జియంను ఆత్మరక్షణలో పడేసింది. ప్రత్యర్థిపై బెల్జియం జట్టు ఒక్క గోల్ కూడా చెయ్యలేకపోయింది. దీంతో బెల్జియం ఓటమి మూటగట్టుకుంది. ఫిఫా ప్రపంచకప్ల చరిత్రలోనే మొరాకోకు ఇది కేవలం మూడో విజయమే కావడం గమనార్హం.