
హైదరాబాద్: వరుసగా 13 మ్యాచ్ల్లో ఓటమనేది ఎరుగకుండా దూసుకెళ్తున్న భారత ఫుట్బాల్ జట్టుకు కిర్గిస్తాన్ అడ్డుకట్ట వేసింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 1-2 గోల్స్ తేడాతో కిర్గిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో భారత రెగ్యులర్ కెప్టెన్ సునీల్ ఛెత్రి బరిలోకి దిగకపోవడంతో కిర్గిస్తాన్ ఆటగాళ్లు చెలరేగారు. కిర్గిస్తాన్ తరఫున జెమ్లియాన్ఖున్ (2వ నిమిషంలో), ముర్జయెవ్ (72వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఇక, భారత్ తరుపున 88వ నిమిషంలో జెజె లాల్ఫెకులువా ఏకైక గోల్ను అందించాడు.
భారత్, కిర్గిస్తాన్ వచ్చే ఏడాది యూఏఈలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ ఫలితం ఇరు జట్లపై ఎలాంటి ప్రభావం చూపదు. చివరిసారిగా 2016 మార్చి 29న తుర్క్మెనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 1-2తో ఓడిన భారత్ ఆ తర్వాత వరుసగా 13 మ్యాచ్ల్లో నెగ్గింది.