కామెరూన్లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వచ్చిన 8 మంది అభిమానులు మృతువాత పడ్డారు. మరో 38 మంది గాయపడ్డారు. దీంతో ప్రస్తుతం ఆ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టోర్నీలో కామెరూన్లోని పాల్బియా స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కామెరూన్, కొమొరోస్ దీవుల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కోసం నిర్వహకులు అభిమానులను ఆకర్శించడానికి ఉచిత టికెట్లు ఇచ్చారు. అంతేకాకుండా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో మ్యాచ్ను చూడడానికి అభిమానులు భారీగా తరలివచ్చారు.
అయితే మ్యాచ్ జరిగే కామెరూన్లోని పాల్బియా స్టేడియం సామర్థ్యం 60 వేలు. సాధారణంగా మ్యాచ్ చూడడానికి 60 శాతం మందిని అనుమతిస్తుంటారు. కానీ ఈ మ్యాచ్ కోసం అభిమానులు అంచనాలకు మించి తరలివచ్చారు. టోర్నీ నిర్వహకులు మ్యాచ్ గురించి విస్తృతంగా ప్రచారం చేయడం కూడా ప్రేక్షకులు భారీగా తరలి రావడానికి కారణమైంది. అయినప్పటికీ అందరినీ లోపలికి అనుమతించడానికి నిర్వాహకులు ఒప్పుకోలేదు. కానీ స్టేడియం ముందు ప్రేక్షకులు భారీగా గుమి గూడడంతో అంత మందిని కంట్రోల్ చేయడం మ్యాచ్ నిర్వహకుల వల్ల కాలేదు. దీంతో మరో దారి లేక 60 శాతంగా ఉన్న అనుమతిని సవరించారు. ఏకంగా 80 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించారు. ప్రేక్షకులు లోపలికి వస్తుండగా ఫ్యాన్ జోన్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో చాలా మంది చిక్కుకున్నారు. దీంతో 8 మంది ఈ తొక్కిసలాటలో ప్రాణాలు వదిలారు. మరో 38 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ ఘటనపై కామెరూన్ ప్రభుత్వం స్పందించింది. స్టేడియం సామర్థ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్టు పేర్కొంది. స్టేడియంలో నెలకొన్న తొక్కిసలాటలో 8 మంది చనిపోయనట్లు నిర్ధారించింది. అలాగే 38 మంది గాయపడినట్టు తెలిపింది. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి అంబులెన్సులు తరలించినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే ట్రాఫిక్జామ్ కారణంగా బాధితులను ఆసుపత్రికి తరలించడంలో కాస్త ఆలస్యమైనట్టు పేర్కొంది. అలాగే ఈ సంఘటనపై దర్యప్తు చేస్తున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికన్ ఫుట్బాల్ సమాఖ్య వెల్లడించింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే కొమెరోస్ దీవులపై కామెరూన్ జట్టు 2-1 తేడాతో గెలిచింది. అంతేకాకుండా ఈ విజయంతో కామెరూన్ జట్టు టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది.