బ్రెజిల్: బ్రెజిల్లో మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలి నలుగురు ఫుట్బాల్ ఆటగాళ్లు సహా ఆరుగురు మృతి చెందారు. ఆదివారం బ్రెజిల్లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పాల్మాస్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడితో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాది రాష్ట్రమైన టొకాన్టిన్లో ఈ ఘటన జరిగిందని టీం యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపింది.
విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో పాల్మాస్ క్లబ్ ప్రెసిడెంట్ లాకస్ మీరాతో పాటు ఆటగాళ్లు లుకాస్ ప్రాక్సీడ్స్, గుల్హెరిమ్, రానులే, మార్కస్ మొలినారి ఉన్నారు. పామాస్ ఫుట్బాల్ క్లబ్ను 1997లో స్థాపించారు. ఇది బ్రెజిల్లోని నార్త్ ఫోర్ డివిజన్కు చెందిన క్లబ్. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆటగాళ్లంతా చనిపోవడంతో పాల్మాస్ ఫుట్ బాల్ క్లబ్లో విషాదం నెలకొంది.
పాల్మాస్ క్లబ్కు చెందిన నలుగురు ఆటగాళ్లకు ఇటీవల కరోనా వైరస్ సోకింది. ఆదివారంతో వారి ఐసోలేషన్ గడువు పూర్తికానుంది. ఈ నేపథ్యంలోనే విలానోవా జట్టుతో తలపడేందుకు తోటి ఆటగాళ్లతో కాకుండా ఆదివారం ప్రత్యేక విమానంలో బయలుదేరారు. టొకాంన్టిన్స్ విమానాశ్రయం నుంచి గొయానాకు టేకాఫ్ అవుతుండగా.. రన్వే అంచున విమానం ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనతో పోటీలను నిలిపివేశారు. బ్రెజిల్లో జరిగే విమాన ప్రమాదాల్లో ఫుట్బాల్ ఆటగాళ్లు మరణించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో జరిగిన ప్రమాదంలో చాపెకోయిన్సీ టీమ్ మొత్తం దుర్మరణం పాలైంది. కొలంబియాలో జరుగుతున్న కోపా సూడామెరినికా ఫైనల్లో పాల్గొనేందుకు ఆటగాళ్లను తీసుకుని వెళుతున్న విమానం కొండ ప్రాంతంలో కుప్పకూలింది. అంతకు రెండేళ్ల ముందు స్టేట్ ఆఫ్ గోజాస్ సమీపంలో హెలికాప్టర్ కూలగా..బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ ఫెర్నాండో దుర్మరణం పాలయ్యారు.
పీటర్సన్.. నువ్ మాత్రమే కాదు! ద్రవిడ్ నుంచి నేను సలహాలు పొందా: జింబాబ్వే మాజీ కెప్టెన్