కరోనాతో ఫుట్బాల్ కోచ్ మృతి
అట్లెటికొ పొర్టాడ అల్టా జట్టుకు కోచ్గా పనిచేస్తున్న 21 ఏళ్ల ఫ్రాన్సిస్కో గార్సియాకు కరోనా వైరస్ సోకడంతో మృతిచెందాడు. అతడు లుకేమియాతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో ఫ్రాన్సిస్కోను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఫ్రాన్సిస్కో మృతి చెందాడు. అయితే అతని వయసు కేవలం 21 ఏళ్లు కావడం విశేషం. ఇప్పటివరకు 7 వేల మంది చనిపోగా.. అందులో ఎక్కువగా 50 ఏళ్లకు పైగా ఉన్నవారే.
నువ్వు లేక ఇప్పుడెలా గెలవాలి
ఫ్రాన్సిస్కో గార్సియా మృతి చెందాడని అట్లెటికొ జట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'ఫ్రాన్సిస్కో ఈ రోజు మమ్మల్ని విడిచి తిరిగారాని లోకాలకు వెళ్లాడు. ఇది ఎంతో బాధాకరం. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్కో కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం' అని అట్లెటికొ జట్టు ట్వీట్ చేసింది. 'గార్సియా నువ్వు లేకుండా ఇప్పుడు మేం ఏం చేయగలం?. నువ్వు లేక ఇప్పుడెలా గెలవాలి?. అయినా నీకోసం గెలిచి తీరుతాం. నిన్నెప్పుడు మరువబోం. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం' అని పేర్కొంది.
కరోనాను దైర్యంగా ఎదుర్కొందాం
మాలాగా సీఎఫ్ కూడా ఫ్రాన్సిస్కో గార్సియా మృతి సంతాపం ప్రకటించింది. 'అట్లెటికొ పొర్టాడ అల్టా జట్టు కోచ్ను కోల్పోయినందుకు మా ప్రగాఢ సానుభూతి. అందరం కలిసి కరోనా వైరస్ను దైర్యంగా ఎదుర్కొందాం' అని ట్వీట్ చేసింది. సోమవారం 21 ఏళ్ల ఫుట్బాల్ ఫ్రాన్సిస్కో గార్సియా మృతిచెందగా.. మంగళవారం స్పెయిన్ అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశంగా దక్షిణ కొరియాను అధిగమించింది.
గారేకు కూడా కరోనా
ఇదివరకే ప్రఖ్యాత ఫుట్బాల్ లీగ్ 'లా లిగా' లీగ్లో ఆడుతున్న అర్జెంటీనా మిడ్ఫీల్డర్ ఎజెక్విల్ గారే (33)కు కరోనా సోకింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. 'ఈ ఏడాది దుర్ముహూర్తంలో ప్రారంభమైంది. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నాకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నా' అని గారే తెలిపాడు.