2010 ప్రపంచకప్కు భారత్ అర్హత సాధించే ఆశలు 2007లోనే ఆవిరయ్యాయి. మరి 2014 ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ పోటీలు 2011లో ప్రారంభమవుతాయి. ఫలితంగా వచ్చే ఏడాది భారత ఫుట్బాల్కు కీలకంకానుంది. ఈ పోటీలకు ముందు భారత్ జనవరిలో కతార్ ఆతిథ్యమిచ్చే ఏషియన్ కప్లో పాల్గొనుంది. 2008 ఏఎఫ్సీ చాలెంజ్ కప్లో భారత్ విజేతగా నిలిచి 26 ఏళ్ల తర్వాత ఏషియన్ కప్కు అర్హత పొందింది. గ్రూప్ 'సి'లో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బహ్రెయిన్లతో భారత్కు చోటు కల్పించారు. ఈ టోర్నీ భారత్ పునర్వైభవం దిశగా పయనించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. క్షేత్రస్థాయిలో సదుపాయాలను పెంచి, ప్రతిభావంతులను వెలికి తీసేందుకు వ్యవస్థ రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు సమాఖ్య అధికారులపై కూడా ఉంది.
ప్రస్తుతం భారత్ ఫుట్బాల్ జట్టు సభ్యుల వివరాలు చర్చకు వస్తే ఇద్దరి పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఒకరేమో కెప్టెన్ బైచుంగ్ భూటియా... మరొకరు సునీల్ చెత్రి. 34 ఏళ్ల భూటియా వందకంటే ఎక్కువ మ్యాచ్ల్లో ఆడాడు. ఇంగ్లండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్ కు చెందిన బ్యూరీ ఫుట్బాల్ క్లబ్కు (1999-2002) ప్రాతినిధ్యం వహించాడు. తద్వారా ఈ ఘనత వహించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. సునీల్ చెత్రి అమెరికాలోని కన్సాస్ సిటీ విజార్డ్స్ జట్టుకు ఆడుతున్నాడు.