న్యూఢిల్లీ: జాతీయ జట్టు సారధి సునీల్ ఛెత్రి, గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సహా ఇండియన్ ఫుట్బాల్ స్టార్ల సమక్షంలో పదవ ఐ - లీగ్ టోర్నీ శోభాయమానంగా మంగళవారం రాత్రి ప్రారంభమైంది. భారత్లోని ప్రధాన ఫుట్బాల్ టోర్నీలో దేశంలోని నాలుగు ప్రధాన రీజియన్లకు ప్రాతినిధ్యం లభించింది.
తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి మొహున్ బగన్, ఈస్ట్ బెంగాల్, ఐజ్వాల్ ఎఫ్ సి, షిల్లాంగ్ లాజోంగ్ .. పశ్చిమ దిశ నుంచి ముంబై ఎఫ్ సి, డిఎస్ కె శివాజీయన్స్, చర్చిల్ బ్రదర్స్.. సౌత్ జోన్ నుంచి బెంగళూరు ఎఫ్ సి, చెన్నై ఎఫ్ సి, నార్త్ నుంచి మినర్వ పంజాబ్ జట్లు ఐదు సెషన్ల అంతరాయం తర్వాత ప్రధాన టోర్నీల్లో పాల్గొననుండటం గమనార్హం.
అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ ఐ - లీగ్ టోర్నీలో దేశంలోని నలు మూలల నుంచి పది జట్లు పాల్గొంటున్నాయని అన్నారు. ఇండియన్ ఫుట్బాల్కు, ఐ - లీగ్కు మద్దతుగా నిలిచినందుకు హీరో మోటో కార్ప్ సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపాడు.

ఐ-లీగ్ టోర్నీ భారత్లోని ఫుట్బాల్ అభిమానులను ఏకం చేసే అంశమన్నాడు. దేశం నలుమూలల నుంచి ఈ టోర్నీలో పలు జట్లు పాల్గొంటున్నాయని, అవన్నీ విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ మాట్లాడుతూ గత కొన్ని ఎడిషన్లలో అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఐ - లీగ్ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని అన్నాడు.
గతంతో పోలిస్తే వీక్షించే వారి సంఖ్య 40 శాతం పెరిగిందని కూడా చెప్పాడు. 10వ ఎడిషన్ టోర్నీ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించాడు. ఆరు నెలల పాటు సాగే లీగ్ వచ్చే నెల ఏడో తేదీన డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి జట్టు.. షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్ సి తో తలపడడంతో మొదలవుతుంది.
హీరో మోటో కార్ప్ సంస్థ చైర్మన్, ఎండి, సిఇఓ పవన్ ముంజాల్ మాట్లాడుతూ భారత దేశంలో యువతలో ప్రజాదరణ పొందిన ఆట పుట్ బాల్ అని తెలిపాడు. ఈ సంస్థ 'ఐ - లీగ్' టోర్నీకి ప్రధాన స్పాన్సరర్గా నిలిచింది. పది జట్లు 100కి పైగా మ్యాచ్ లు ఆడే ఐ - లీగ్, హీరో ఫెడరేషన్ కప్ అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తిని తప్పక తెస్తుందన్నారు. భవిష్యత్లో ఆట ప్రగతి పథంలో సాగేందుకు దోహద పడుతుందన్నాడు.
పెద్ద క్లబ్ల వైపు గురుప్రీత్సింగ్ చూపు
వచ్చే ఏడాది యూరప్లోని అతిపెద్ద క్లబ్ల్లో ఆడే అంశంపై ద్రుష్టి సారించానని భారత జాతీయ ఫుట్బాల్ టీం గోల్కీపర్ గురుప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. భారత్ నుంచి యూరప్లోని నార్వేయన్ టీం స్టాబేక్ ఎఫ్ సి జట్టులో ఆడుతున్న తొలి ఫుట్బాల్ క్రీడాకారుడిగా నిలిచాడు. 'నా కాంట్రాక్ట్ మరో సెషన్లో నార్వే జట్టుతో ముగుస్తుంది. కానీ నేను వ్యక్తిగతంగా యూరప్లో పెద్ద క్లబ్ టీంలలో ఆడే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా' అని అన్నాడు.
గత సీజన్ లో గాయం కారణంగా ఈ పంజాబీ కుర్రాడు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. యూరప్ లోని లీగ్ ల్లో పాల్గొనగలిగితే అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటలో మరింత పురోగతి సాధించేందుకు వెసులుబాటు లభిస్తుందన్నాడు. ఉత్తమ ప్లేయర్లకు స్వల్పకాలిక లక్ష్యాలు అవసరమని చెప్పాడు. యువ ప్లేయర్లకు యూరప్లో గానీ, భారత్ బయట శిక్షణ కల్పిస్తే మెరుగైన వసతులు కల్పిస్తాయన్నాడు.
భారత్లో ఫుట్బాల్ ఎదుగుదలకు చాలా సమయం పడుతుందన్నాడు. 2022 వరల్డ్ కప్ టోర్నీకి అర్హత సాధించడమే తమ లక్ష్యమని ఎఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తనతో చెప్పాడన్నాడు. అయితే అసాధ్యం కానిదేమీ లేదన్నాడు. రెండేళ్ల క్రితం ఏ ఒక్కరు కూడా భారతీయుడు యూరప్ క్లబ్లో ఆడతాడని ఊహించలేదన్నాడు.
థాయిలాండ్ అందుకు ఒక ఉదాహరణ అని తెలిపాడు. ఉదాహరణల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ఈ ఏడాది ఎఐఎఫ్ఎఫ్ ఉత్తమ గోల్కీపర్ అవార్డుకు తాను నామినేట్ కావడం ప్రత్యేక గుర్తింపని చెప్పాడు. ఐ - లీగ్లో మినర్వ పంజాబ్ ఎఫ్సి చేరికతో ఉత్తర భారత ప్రాంతంలో ఫుట్బాల్ కల్చర్ పునరుద్ధరణకు మార్గం సుగమం అవుతుందన్నాడు.