మాంఛెస్టర్: టీమిండియా వికెట్ కీపర్, మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గ్రౌండ్లో వెస్టిండీస్ బౌలర్ల భరతం పడుతోంటే- ఆయన కుమార్తె జివా స్టేడియంలో సందడి చేస్తూ కనిపించింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో గురువారం వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా ఈ దృశ్యం ఆకట్టుకుంది. స్టాండ్స్లో నిల్చుని త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకుని జివా సందడి చేసింది. మెన్ ఇన్ బ్లూస్ అని ఉచ్ఛరిస్తూ మన జాతీయ పతాకాన్ని అటు, ఇటు తిప్పుతూ ఉత్సాహపరిచింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
వెస్టిండీస్ ఓటమిపై అజరుద్దీన్ షాకింగ్ కామెంట్స్!
ఈ నెల 16వ తేదీన పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా కూడా జివా ఇదే స్టేడియంలో కనిపించిన విషయం తెలిసిందే. గాయపడ్డ శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్తో ఆడుకుంటూ అభిమానుల కంటికి చిక్కిందా చిన్నారి. తుది జట్టులో చోటు దక్కకపోవడంతో జివాతో కలిసి స్టాండ్స్లో కాలక్షేపం చేశాడు రిషబ్ పంత్.
వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు 129 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే.. సెమీ ఫైనల్లో బెర్త్ను ఖాయం చేసుకుంటుంది కోహ్లీ సేన. టీమిండియా తదుపరి మ్యాచ్ ఆదివారం జరుగనుంది. టైటిల్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా గుర్తింపు ఉన్న ఇంగ్లండ్ జట్టును ఢీకొన బోతోంది భారత క్రికెట్ జట్టు. ఈ మ్యాచ్- బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభం అవుతుంది.