ఆఖరి బంతి వరకు సాగిన హోరాహొరీగా పోరులో జింబాబ్వేపై శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్వదేశంలో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో బోణీ కొట్టి 1-0తో లంక ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు లంక ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
జింబాబ్వేకు శుభారంభం దక్కలేదు. ఆది నుంచి జాగ్రత్తగా ఆడింది. ఆరో ఓవర్లో ఓపెనర్ తినాషే (26; 18 బంతుల్లో) ఔటయ్యాడు. అదే ఓవర్లో మరో ఓపెనర్ క్రెయిగ్ (10; 16 బంతుల్లో) కూడా పెవిలియన్కు చేరాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన సీన్ విలియమ్స్ (14; 20 బంతుల్లో) కలిసి కెప్టెన్ సికందర్ రజా (62; 42 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలించాడు. కానీ మరో ఎండ్లో నుంచి సికందర్కు సహకారం లభించలేదు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, కెప్టెన్ హసరంగ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. చమీర ఒక వికెట్ తీశాడు.

అనంతరం ఛేదన ప్రారంభించిన శ్రీలంకకు పేలవ ఆరంభం దక్కింది. మూడో బంతికే నిశాంక (2) ఔటయ్యాడు. ఆ తర్వాత జింబాబ్వే బౌలర్లు వరుస వికెట్లతో లంక బ్యాటర్లను హడలెత్తించారు. దీంతో లంక 14 ఓవర్లలో 83 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన షనక (26*; 18 బంతుల్లో) కలిసి మాథ్యూస్ (46; 38 బంతుల్లో) జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు కలిసి అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే లంక విజయానికి ఆఖరి ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. తొలి రెండు బంతుల్ని మాథ్యూస్ బౌండరీకి తరలించాడు. కానీ మూడో బంతికి పరుగులేమి చేయలేకపోయిన అతడు.. నాలుగో బాల్కు ఔటయ్యాడు. కాగా, క్రీజులోకి వచ్చిన చమీర అయిదో బంతికి బౌండరీ సాధించాడు. ఆఖరి బంతికి మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడి రెండు పరుగులు తీసి చమీర జట్టుకు విజయాన్ని అందించాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా మూడు వికెట్లు, బ్లెస్సింగ్ రెండు, రిచర్డ్, వెల్లిగ్టంన్ తలో వికెట్ తీశారు.
జనవరిలో శ్రీలంక పర్యటన వచ్చిన జింబాబ్వే మూడు వన్డేల సిరీస్ను 0-2తో కోల్పోయింది. కాగా, రెండో టీ20 మ్యాచ్ను జనవరి 16న కొలంబో వేదికగా లంకతో తలపడనుంది.