టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియనల్ ఆఫ్రికా క్వాలిఫయిర్ గ్రూప్ బీలో భాగంగా బుధవారం గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 290 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో జింబాబ్వే పలు ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టింది. టీ20 ఫార్మాట్లో నయా చరిత్ర సృష్టించింది.
మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 344 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా (133 నాటౌట్; 43 బంతుల్లో, 7 ఫోర్లు, 15 సిక్సర్లు) మెరుపు శతకంతో విజృంభించాడు. బ్రియాన్ బెన్నెట్ (50; 26 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), మారుమణి (62; 19 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), క్లైవ్ మదండే (53; 17 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకు కుప్పకూలింది. ఆండ్రీ జర్జు మాత్రమే (12) రెండంకెల స్కోరు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్, బ్రాండన్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్లో బద్దలైన ప్రపంచ రికార్డులు ఇవే...
టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా జింబాబ్వే (344/4) నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు నేపాల్ (314/3 వర్సెస్ మంగోలియా) పేరిట ఉండేది.
టీ20ల్లో పరుగుల పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా జింబాబ్వే (290 పరుగులు) నిలిచింది.
టీ20ల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్టుగా జింబాబ్వే (27 సిక్సర్లు) రికార్డు నెలకొల్పింది.
టీ20ల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక ఫోర్లు సాధించిన జట్టుగా శ్రీలంకతో జింబాబ్వే (30 ఫోర్లు) సమంగా నిలిచింది.
టీ20ల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు (సిక్సర్లు+ ఫోర్లు) బాదిన జట్టుగా జింబాబ్వే (57) రికార్డు సాధించింది.
టీ20 మ్యాచ్లో ఓ జట్టు తరఫున నలుగురు బ్యాటర్లు అర్ధశతకం సాధించడం ఇదే ప్రథమం. ఈ ఘనత జింబాబ్వే అందుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన రెండో సెంచరీ సాధించిన ప్లేయర్గా నమీబియా ప్లేయర్ జాన్ నికోల్ ఈటన్ సరసన సికిందర్ రజా (33 బంతుల్లో) చేరాడు. ఎస్తోనియా ప్లేయర్ సౌహిల్ చౌహాన్ 27 బంతుల్లో శతకం బాదాడు.
టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్గా సికిందర్ రజా (17) నిలిచాడు.
టీ20ల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ముసా జోబెథ్ నిలిచాడు. ముసా 4 ఓవర్లలో 93 పరుగులు ఇచ్చాడు.
టీ20ల్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక బౌలర్లు 50+ పరుగులు ఇచ్చిన జట్టుగా గాంబియా నిలిచింది. 5గురు బౌలర్లు 50+ రన్స్ లీక్ చేశారు.