టీ20 ఫార్మాట్లో జింబాబ్వే ప్రపంచ రికార్డు నమోదుచేసింది. అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియనల్ ఆఫ్రికా క్వాలిఫయిర్ గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 344 పరుగులు చేసింది.
ఈ క్రమంలో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డు బద్దలైంది. 2023లో మంగోలియాపై నేపాల్ మూడు వికెట్లకు 314 పరుగులు చేసింది. ఈ జాబితాలో జింబాబ్వే, నేపాల్ తర్వాతి స్థానాల్లో భారత్ (297/6 వర్సెస్ బంగ్లాదేశ్), అఫ్గానిస్థాన్ (278/3 వర్సెస్ ఐర్లాండ్), చెక్ రిపబ్లిక్ (278/4 వర్సెస్ టర్కీ) ఉన్నాయి.

కాగా, గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 290 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అజేయ శతకంతో చెలరేగాడు. 43 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఏడు ఫోర్లు, 15 సిక్సర్లతో విజృంభించాడు. బ్రియాన్ బెన్నెట్ (50; 26 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్), మారుమణి (62; 19 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు), క్లైవ్ మదండే (53; 17 బంతుల్లో, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు.
బెన్నెట్, మారుమణి ఆది నుంచే బౌండరీ మోత మోగించారు. వీరిద్దరు తొలి వికెట్కు 34 బంతుల్లో 98 పరుగులు చేశారు. వన్డౌన్లో వచ్చిన మేయర్స్ (12; 5 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో నాలుగో స్థానంలో వచ్చిన సికిందర్ రజా విధ్వంసం సృష్టించాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆఖర్లో క్లైవ్ ఎడాపెడా షాట్లు బాదడంతో జింబాబ్వే భారీ స్కోరు చేసింది. గాంబియా బౌలర్లలో ఆండ్రీ జర్జు (2/53), అర్జున్సింగ్ రాజ్పురోహిత్ (1/51), బబూకర్ (1/57) చెరో వికెట్ తీశారు.
అనంతరం ఛేదనలో గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకు కుప్పకూలింది. ఆండ్రీ జర్జు మాత్రమే (12) రెండంకెల స్కోరు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్, బ్రాండన్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.