కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో జింబాబ్వే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ను 1-1తో సమం చేసింది. నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్ గురువారం జరగనుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 173 పరుగులు చేసింది. జింబాబ్వే 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఛేదనలో జింబాబ్వేకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ తినాషే(12; 13) ఆదిలోనే ఔటయ్యాడు. కానీ వన్డౌన్లో వచ్చిన బెనెట్ (25; 20 బంతుల్లో)తో కలిసి మరో ఓపెనర్ క్రెయిగ్ (70; 54 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కు 76 పరుగులు జోడించారు. అయితే బెనెట్, సీన్ విలియమ్స్ (1)లను తీక్షణ, సికందర్ రజా (8)ను చమీర స్వల్ప వ్యవధిలోనే ఔట్ చేసి శ్రీలంకను తిరిగి పోటీలోకి తెచ్చారు.

కానీ లూకే (25*; 12 బంతుల్లో), క్లైవ్ (15*; 5 బంతుల్లో) గొప్ప పోరాటంతో జింబాబ్వేను గెలిపించారు. జింబాబ్వే విజయానికి ఆఖరి ఓవర్లో 20 పరుగులు అవసరమయ్యాయి. లంక కెప్టెన్ హసరంగ బంతిని మాథ్యూస్కు ఇచ్చాడు. అయితే తొలి బంతిని మాథ్యూస్ నోబాల్ వేయగా లూకే దాన్ని సిక్సర్గా మలిచాడు. ఫ్రీ హిట్కు బౌండరీని సాధించాడు. రెండో బంతిని కూడా స్టాండ్స్కు తరలించడంతో జింబాబ్వే గెలుపు సమీకరణం నాలుగు బంతుల్లో మూడు పరుగులుగా మారింది.
అయితే ఆ తర్వాతి రెండు బంతులకి ఒక్క పరుగే వచ్చింది. అయిదో బంతికి క్లైవ్ సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో జింబాబ్వే రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ పురుషల టీ20 క్రికెట్లో ఆఖరి ఓవర్లలో అత్యధిక పరుగులు చేసి విజయం సాధించిన మూడో జట్టుగా జింబాబ్వే చరిత్రకెక్కింది. ఈ రికార్డులో టాప్-3 గణాంకాలు గత 50 రోజుల్లోనే నమోదకావడం విశేషం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా టాప్లో ఉంది.

భారత్పై ఆఖరి ఓవర్లో ఆసీస్ 21 పరుగులు చేసి గెలిచింది. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్.. వెస్టిండీస్పై 21 పరుగులు సాధించి నెగ్గింది. మూడో స్థానంలో జింబాబ్వే (20 పరుగులు) నిలిచింది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అసలంక (69; 39 బంతుల్లో), మాథ్యూస్ (66; 51 బంతుల్లో) అయిదో వికెట్కు శతక భాగస్వామ్యం నెలకొల్పారు. మాథ్యూస్ నిలకడగా పరుగులు చేయగా అసలంక దూకుడు ఆడుతూ స్కోరుబోర్డును వేగంగా నడిపించాడు.