హరారే: అంతర్జాతీయ క్రికెట్లో మనుగడ కోసం కష్టపడుతోన్న జింబాబ్వే క్రికెట్ జట్టుపై మరో పిడుగు పడింది. ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తక్షణమే సస్పెన్షన్ వేటు వేస్తూ ఆ దేశ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. జింబాబ్వే క్రికెట్ బోర్డు తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మకోనీని సైతం పదవి నుంచి వైదొలగాలని ఆదేశించింది.
కొద్దిరోజుల కిందట జరిగిన జింబాబ్వే క్రికెట్ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకోవడమే దీనికి కారణమని అంటున్నారు. వారంరోజుల కిందట జింబాబ్వే క్రికెట్ చైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి. జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్గా ఎన్నికైన వారు నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ముక్లానీ మరోసారి ఎన్నికయ్యారు.
ముక్లానీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగలేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాజ్యాంగ విరుద్ధంగా ఆయనను ఎన్నికయ్యారంటూ ఆ దేశాధ్యక్షుడికి పలువురు క్రికెటర్లు, అధికారులు ఫిర్యాదు చేశారు. దీనితో ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. మొత్తం బోర్డును రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ జింబాబ్వే క్రికెట్ బోర్డు స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ సంస్థ ఆధీనంలో ఉంటుంది.