
హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్కు అర్హత సాధించడంలో విఫలమైన జింబాబ్వే జట్టు ఇప్పుడు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటోంది. ఆ జట్టు కెప్టెన్ క్రీమర్తో పాటు చీఫ్ కోచ్ హీత్ స్ట్రీక్లను జింబాబ్వే క్రికెట్ బోర్డు పదవుల నుంచి తప్పించింది.
ఐసీసీ వరల్డ్ కప్లో పాల్గొనేందుకు గాను జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్లో ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో జింబాబ్వే జట్టు పేలవ ప్రదర్శన చేయడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకుంది. క్రీమర్ను కెప్టెన్సీ నుంచి తొలగించి అతని స్థానంలో బ్రెండన్ టేలర్కు సారథ్య బాధ్యతలను అప్పగించింది.
ఇక, హెడ్ కోచ్ హీత్ స్ట్రీక్, బ్యాటింగ్ కోచ్ లాన్స్ క్లూసెనర్, బౌలింగ్ కోచ్ డగ్లస్ హోండో, ఫీల్డింగ్ కోచ్ వాల్టర్ చవగుట, ఫిట్నెస్ కోచ్ సీన్ బెల్, అనలిస్ట్ స్టాన్లె చీజాలతో పాటు కోచింగ్ స్టాఫ్ను కూడా తక్షణమే తొలగిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఈ మేరకు జింబాబ్వే క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
వీరితో పాటు సెలక్షన్ కమిటీ కన్వీనర్ తతేంద తైబు, అండర్-19 కోచ్ స్టీఫెన్ మాన గోంగోలను కూడా వారి పదవుల నుంచి తొలగించింది. 1979 తర్వాత జింబాబ్వే వరల్డ్ కప్కు అర్హత సాధించక లేకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన వెస్టిండిస్, ఆప్ఘనిస్థాన్ జట్లు వరల్డ్ కప్కు అర్హత సాధించాయి.