
హైదరాబాద్: జింబాబ్వే క్రికెట్ బోర్డు ఐసీసీకి మొర పెట్టుకుంది. అదీ ఏదైనా మ్యాచ్ గురించి కాదు. అప్పిస్తే ఆతిథ్యమిస్తామంటూ ఐసీసీని వేడుకుంటోంది. ఇలా మాటల ద్వారా తెలపడమే కాదు జింబాబ్వే క్రికెట్ బోర్డు అప్పు కోరుతూ ఓ దరఖాస్తును సైతం ఐసీసీకి పంపింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో పాక్ జట్టు.. జింబాబ్వే పర్యటించాలి.
అయితే ప్రస్తుతం జింబాబ్వే క్రికెట్ బోర్డు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. క్రికెట్ కార్యకలాపాలు నిర్వహించడానికి బోర్డు దగ్గర డబ్బుల్లేవు. మరోవైపు పాకిస్థాన్ జట్టు కూడా ఆతిథ్యం ఇవ్వలేమంటే చెప్పండి.. ప్రత్యామ్నాయాలు చూసుకుంటామంటూ సందేశాలు పంపింది. దీంతో జింబాబ్వే బోర్డు.. ఐసీసీ మద్దతు కోరింది.
పర్యటన కోసం రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు రుణ దరఖాస్తును కూడా పంపింది. ''ఐసీసీ మద్దతు కోరామని.. పర్యటనపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోవద్దని ఏప్రిల్ వరకు ఆగమంటూ జింబాబ్వే బోర్డు మమ్మల్ని కోరింది. ఒక వేళ ఈ ప్రయత్నంలో జింబాబ్వే విఫలమైతే మేం ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తాం'' అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజమ్ సేథి అన్నాడు.
గతేడాది జింబాబ్వే క్రికెటర్లు, ఇతర ఆఫీసు సిబ్బంది జీతాల్లేక ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, జింబాబ్వే దేశంలో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టీ 20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది.