జింబాబ్వే టీ20 కెప్టెన్, ఐపీఎల్ మాజీ ఆటగాడు సికందర్ రజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మహమ్మద్ మెహదీ(13) తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ బాధాకరమైన వార్తను జింబాబ్వే క్రికెట్ బోర్డు తన సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది.
సికందర్ రజా సోదరుడు మహమ్మద్ మెహదీ గత కొంతకాలంగా 'హీమోఫీలియా' అనే అరుదైన జన్యుపరమైన రక్త రుగ్మతతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారికి గాయం అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు. ఇటీవలే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డిసెంబర్ 29, 2025న ఆయన మరణించినట్లు బోర్డు వెల్లడించింది. డిసెంబర్ 30న హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

జింబాబ్వే క్రికెట్ బోర్డు సంతాపం
"సికందర్ రజా కుటుంబానికి జరిగిన ఈ తీరని లోటుకు జింబాబ్వే క్రికెట్ బోర్డు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. బోర్డు మేనేజ్మెంట్, ఆటగాళ్లు, సిబ్బంది అందరూ ఈ కష్టసమయంలో రజా కుటుంబానికి అండగా ఉంటారు. మెహదీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము" అని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. దీనికి స్పందిస్తూ రజా తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పగిలిన గుండె ఎమోజీని షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
పాకిస్థాన్ నుంచి జింబాబ్వే వరకు రజా ప్రస్థానం
సికందర్ రజా 1986లో పాకిస్థాన్లోని సియాల్కోట్లో జన్మించారు. 2002లో తన కుటుంబంతో కలిసి జింబాబ్వేకు వలస వెళ్లారు. అక్కడ క్రికెట్లో రాణించి ఆ దేశ జట్టుకు కెప్టెన్గా ఎదిగారు. సికిందర్ రజా ఐపీఎల్లో కూడా అద్భుతంగా రాణించారు. రజా 2023, 2024 సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరపున ఆడారు. 9 మ్యాచ్ల్లో 182 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లోనూ కీలక పాత్ర పోషించారు.ఫిబ్రవరి 2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్లో జింబాబ్వే జట్టును రజా నడిపించనున్నారు. ఫిబ్రవరి 9న ఒమన్తో జరిగే మ్యాచ్తో వారి పోరాటం మొదలవుతుంది. మెహదీ మరణం పట్ల క్రికెట్ ప్రపంచం అంతా సికందర్ రజాకు సంతాపం తెలియజేస్తోంది.