జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే పాకిస్థాన్ కైవసం చేసుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన రెండో టీ20లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అయితే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 12.4 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది.
ఓ దశలో 37/0తో ఫర్వాలేదన్న స్థితి నుంచి 57 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు బ్రెయిన్ బెన్నెట్ (21; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), టి మరుమణి (16; 14 బంతుల్లో, 3 ఫోర్లు) నిలకడగా బ్యాటింగ్ ఆరంభించారు. 4.2 ఓవర్లలో ఆరు బౌండరీలు, ఓ సిక్సర్తో 37 పరుగులు జోడించారు. కానీ ఆ తర్వాత వరుసగా పెవిలియన్కు చేరారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన బ్యాటర్లు కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు.

పాకిస్థాన్ బౌలర్లలో సూఫీ ముఖీమ్ 2.4 ఓవర్లలో మూడు పరుగులే ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టాడు. అబ్బాస్ అఫ్రిది (2/2) రెండు వికెట్లు, కెప్టెన్ సల్మాన్ అఘా (1/7), హారిస్ రవూఫ్ (1/13), అబ్రార్ అహ్మద్ (1/21) తలో వికెట్ తీశారు. అయితే టీ20 చరిత్రలో జింబాబ్వేకు ఇదే అత్యల్ప స్కోరు. అంతకుముందు ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో చేసిన 82 పరుగులు అత్యల్పంగా ఉండేవి.
ఛేదనలో పాకిస్థాన్ 33 బంతుల్లో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్లు సయిమ్ అయుబ్ (36 నాటౌట్; 18 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), ఒమైర్ యూసఫ్ (22 నాటౌట్; 15 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. కాగా, జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్ను పాక్ 2-1తో గెలిచిన సంగతి తెలిసిందే.