పాకిస్థాన్కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. తమ దేశ పర్యటనకు వచ్చిన పాక్ను తొలి మ్యాచ్లో చిత్తుగా ఓడించింది. బులవాయో వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. ఎంగర్వ (48; 52 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్), సికందర్ రజా (39; 56 బంతుల్లో, 6 ఫోర్లు) సత్తాచాటారు.
పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ అగా (3/42), ఫైజల్ అక్రమ్ (3/24) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన జింబాబ్వే నిలకడగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు గుంబీ (15; 17 బంతుల్లో, 3 ఫోర్లు), మరుమణి (29; 41 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ తొలి వికెట్కు 40 పరుగులు జోడించారు. అయితే అనవసర పరుగుకు ప్రయత్నించి గుంబీ రనౌటయ్యాడు.

అనంతరం జింబాబ్వే క్రమంగా వికెట్లు కోల్పోయింది. 125 పరుగులకే ఏడు వికెట్లను చేజార్చుకుంది. కానీ ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఎంగర్వ తో కలిసి సికిందర్ రజా స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. పాక్ ముంగిట గౌరవప్రదమైన స్కోరు ఉంచారు. అయితే ఛేదనలో పాకిస్థాన్ తడబడింది. జింబాబ్వే బౌలర్లు ముందు నిలవలేక ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. 17 పరుగులకే ఓపెనర్లు వెనుదిరిగారు.

కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (19; 43 బంతుల్లో, 1 ఫోర్), కమ్రాన్ గులామ్ (17; 28 బంతుల్లో, 3 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించారు. కానీ జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో 58 పరుగులకే పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే పాక్ స్కోరు 60/6తో ఉన్న స్థితిలో ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం ధాటికి తిరిగి ఆటను ప్రారంభించడం కష్టమని భావించిన అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. ముజరబాని (2/9), సీన్ విలియమ్స్ (2/12), సికందర్ రజా (2/7) తలో రెండు వికెట్లు తీశారు.