హైదరాబాద్: 'దంగల్' నటి జైరా వసీంకు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాసటగా నిలిచాడు. జైరా వసీంతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం అవమానకరమని అన్నాడు. జైరా వ్వవహారంలో కొత్తగా లింగ భేదాన్ని గంభీర్ తెరపైకి తీసుకొచ్చాడు.
'దంగల్ సినిమాలో నటించడం లేదా జైరా జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీని కలవడంపై విమర్శలు గుప్పించిన వారిపై గంభీర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దంగల్లో నటించినందుకో.. మెహబూబాను కలిసినందుకో జైరాను అన్ఇస్లామిక్ అని విమర్శించడం దారుణమని, ఆమె క్షమాపణ చెప్పాల్సి రావడం విమర్శకులు సిగ్గు పడాల్సిన విషయం అని ట్వీట్ చేశాడు.

జైరా వ్యవహారంలో లింగ వివక్ష స్పష్టంగా కనబడుతోందని అన్నాడు. జైరాను అడిగినట్టే బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్లు చేసి ఉంటే ఇలాగే విమర్శించేవాళ్లా? అని గంభీర్ ప్రశ్నించాడు. అభద్రతా భావంతోనే జైరాపై విమర్శలు చేస్తున్నారని గంభీర్ ట్వీట్ చేశాడు.

జైరాలాంటి బాలికల ఎదుగదలను చూసి తట్టుకోలేకపోతున్నారంటూ 'మెన్ విల్ బి మెన్' అని గంభీర్ మరో ట్వీట్ చేశాడు. జైరా వసీంకు రెజ్లర్లు గీతా పొగట్, బబితా పొగట్ అండగా నిలిచారు. తామంతా ఆమె వెంటే ఉంటామని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.