
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ టెస్ట్లలో ఇండియా జట్టుకు కెప్టెన్సీ చేసే విషయంలో జస్ప్రీత్ బుమ్రాపై విశ్వాసం ఉందని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ సర్జరీతో జర్మనీలో చికిత్స పొందుతుండడం, రోహిత్ శర్మ కరోనా వల్ల ఐసోలేషన్లో ఉండడంతో కెప్టెన్సీ విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా ఎంపిక చేస్తారనే టాక్ అయితే నడుస్తోంది. 'బర్మింగ్హామ్ టెస్ట్లో జస్ప్రీత్ బుమ్రా చాలా కీలకమైన ఆటగాడు.
రోహిత్ శర్మ కరోనా వల్ల దూరమైతే తానే కెప్టెన్గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అతను భావించడం ప్రారంభించాడు. అతను కొంచెం ప్రెషర్ ఫీలయ్యే ఉంటాడు. అయితే అదనంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం బుమ్రా లాంటి ఆటగాడికి ప్రయోజనకరంగా ఉంటుంది' అని జహీర్ తెలిపాడు.
ఇటీవల భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్.. రోహిత్ మ్యాచ్ ఆడకపోతే తమ దగ్గర అందుకు తగ్గ ప్లాన్స్ ఉన్నాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఓపెనర్ విషయంలోనూ ఓ ఆలోచన ఉందని పేర్కొన్నాడు. ఇక జహీర్ ఖాన్ మాత్రం ప్రస్తుతం నంబర్ త్రీలో బరిలోకి దిగుతున్న చటేశ్వర్ పుజారాను ఓపెనర్గా బరిలోకి దింపొచ్చు అని పేర్కొన్నాడు. పుజారా కౌంటీ క్రికెట్లో చాలా మ్యాచ్లు ఆడాడని, అందువల్లే అతను జాతీయ జట్టులో పునరాగమనం చేశాడని, కౌంటీల వల్ల ఇంగ్లాండ్ పిచ్ల మీద అవగాహన అతనికి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

'రోహిత్ శర్మకు కవర్ ప్లేయర్గా మయాంక్ అగర్వాల్ను టెస్టుల కోసం జట్టులోకి తీసుకున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ సకాలంలో కోలుకోకపోతే.. మయాంక్ కంటే ఇన్నింగ్స్ను ప్రారంభించడానికి చటేశ్వర్ పుజారాను జట్టు ఎంచుకుంటుందని నేను భావిస్తున్నాను. అతను ఇటీవల కౌంటీ క్రికెట్లో ఈ పరిస్థితుల్లో ఆడాడు. అతను ఇంగ్లాండ్ మీద భారత్కు ఓపెనర్లలో ఒకడు కాగలడని నేను నమ్ముతున్నాను' అని జహీర్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో బరిలోకి దిగుతుంది. ఇటీవల న్యూజిలాండ్ను ఘోరంగా ఓడించి మంచి విజయోత్సాహంలో ఇంగ్లాండ్ కన్పిస్తుంది. అదే ఊపును టీమిండియా మీద కూడా కొనసాగించాలని చూస్తోంది.